World Cup-Handshake: మహిళల వరల్డ్ కప్.. పాక్ జట్టుతో టీమిండియా జట్టు షేక్ హ్యాండ్పై బీసీసీఐ సెక్రెటరీ స్పందన
ABN , Publish Date - Oct 02 , 2025 | 05:33 PM
మహిళల వరల్డ్ కప్లో భాగంగా పాక్ జట్టుతో టీమిండియా జట్టు కరచాలనం చేస్తుందా అన్న ప్రశ్నపై బీసీసీఐ సెక్రెటరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఇప్పుడే చెప్పడానికి ఏమీ లేకపోయినప్పటికీ గతం వారం రోజుల్లో భారత్-పాక్ దౌత్య సంబంధాల్లో పెద్దగా వచ్చిన మార్పు ఏమీ లేదని కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్లో భారత్-పాక్ హ్యాండ్ షేక్ అంశం ఎంతటి వివాదానికి దారి తీసిందో తెలిసిందే. ఇక మహిళల వరల్డ్ కప్లో కూడా ఇదే సీన్ రిపీట్ కానున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గతం వారం రోజుల్లో పాక్తో బంధంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు (Women World Cup Handshake Controversy).
ఆసియా కప్ సీన్ ఈ వరల్డ్ కప్లో రిపీట్ అవుతుందా అంటూ మీడియా వేసిన ప్రశ్నకు దేవజిత్ స్పందించారు. నేరుగా సమాధానం ఇవ్వకుండా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ విషయమై ఇప్పుడే నేనేమీ చెప్పలేను. కానీ శత్రుదేశంతో సంబంధాల్లో ఎలాంటి మార్పు లేదు. గతం వారంలో కూడా కొత్త మార్పులేమీ రాలేదు. అయితే, కొలంబోలో పాక్తో భారత్ తలపడుతుంది. గేమ్కు సంబంధించి అన్ని ప్రొటొకాల్స్ యథాతథంగా సాగుతాయి. ఎమ్సీసీ నిబంధనలు అలాగే కొనసాగుతాయి. అయితే హ్యాండ్ షేక్స్, హగ్స్ గురించి మాత్రం ఇప్పుడే ఏమీ చెప్పలేము’ అని అన్నారు (BCCI).
అయితే, పాక్తో మ్యాచ్ సందర్భంగా మునుపటి సీన్లే రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. టాస్ సందర్భంగా, ఆ తరువాత మ్యాచ్ ముగిశాక ప్రత్యర్థి జట్టు సభ్యులతో కరచాలనం చేయొద్దని టీమిండియా సభ్యులకు సూచనలు వెళ్లినట్టు సమాచారం.
మహిళల వరల్డ్ కప్ సెప్టెంబర్ 30 నుంచి మొదలైన విషయం తెలిసిందే. శ్రీలంకపై జరిగిన మ్యాచ్లో భారత్ 59 పరుగుల తేడాతో సులువుగా విజయం సాధించింది. అంతర్జాతీయ టోర్నీల్లో భాగంగా భారత్, పాక్ మధ్య మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరిగేలా షెడ్యూల్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే భారత్, పాక్ మ్యాచ్ కొలంబో వేదికగా జరగనుంది.
ఇవి కూడా చదవండి
వెస్టిండీస్ తడబాటు.. తొలి ఇన్నింగ్స్లో స్కోరు ఇదీ
పాక్ క్రికెట్లో సంక్షోభం.. నఖ్వీ రాజీనామా చేయాలని అఫ్రీది డిమాండ్..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి