Adani Group Indigenous AI: విదేశీ ‘ఏఐ’ టూల్స్పై జర జాగ్రత్త
ABN , Publish Date - Dec 29 , 2025 | 05:30 AM
మన దేశ సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రత్యేక కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్స్ ను దేశీయంగానే అభివృద్ధి చేసుకోవాలని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కోరారు. లేకపోతే...
మన ‘ఏఐ’ టూల్స్ను మనమే నిర్మించుకోవాలి
మన డేటా మన దగ్గరే ఉండాలి
టెక్ సార్వభౌమత్వం కీలకమే
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ
న్యూఢిల్లీ: మన దేశ సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రత్యేక కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత టూల్స్ ను దేశీయంగానే అభివృద్ధి చేసుకోవాలని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కోరారు. లేకపోతే మన డేటా, ఉద్యోగాలు, ఆలోచనలు, సంస్కృతి విదేశీ కంపెనీల ఏఐ ఆధారిత టూల్స్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆర్థికంగా కూడా ఇది మన దేశానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం లాంటి దేశానికి ఇది ఏ మాత్రం తగదన్నారు. మహారాష్ట్రలో బారామతి వద్ద ఏర్పాటైన ‘శరద్ పవార్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఏఐ’ను ప్రారంభిస్తూ ఆయన ఈ హెచ్చరిక చేశారు.
ఆ దశ దాటిపోయింది: ఏఐ ప్రస్తుతం ఆవిష్కరణల దశ దాటిపోయిందని అదానీ స్పష్టం చేశారు. ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో ఏఐ ప్రస్తుతం కీలక శక్తిగా మారిందన్నారు. ఏఐ ఆధిపత్యం కోసం ప్రస్తుతం చైనా-అమెరికా మధ్య జరుగుతున్న పోరును గుర్తు చేశారు. సెమీకండక్టర్లు వ్యూహాత్మక ఆస్తులుగా, డేటా కేంద్రాలు కీలక మౌలిక సదుపాయాల కేంద్రాలుగా మారాయన్నారు. మనకంటూ సొంత ఏఐ టూల్స్ను అభివృద్ధి చేసుకోకపోతే విదేశీ కంపెనీలు మనల్ని ఆర్ధికంగానూ కొల్లగొట్టే ప్రమా దం ఉందని అదానీ హెచ్చరించారు.
‘రక్షణ’పై రూ.1.8 లక్షల పెట్టుబడులు: మరోవైపు అదానీ గ్రూప్ పెద్దఎత్తున దేశ రక్షణకు అవసరమైన ఆయుధ వ్యవస్థల ఉత్పత్తికి సిద్ధమవుతోంది. అదానీ గ్రూప్ సంస్థ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ ఇందుకోసం వచ్చే ఏడాది దాదాపు రూ.1.8 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. సైన్యం, వైమానిక, నౌకాదళాలకు అవసరమైన అధునాతన గైడెడ్ ఆయుధాలు, మానవ రహిత, స్వయంచాలిత వ్యవస్థల తయారీ కోసం ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇటీవల ఆపరేషన్ సిందూర్లోనూ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ అందించిన ఆయుధాలు తమ సత్తా చాటాయి. దీంతో డ్రోన్లు, అవాక్స్ వంటి అధునానత ఆయుధాలు తయారు చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
ఇవీ చదవండి
ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..
మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై పన్ను పోటు ఎంత