అభిషేక్ తుఫాన్
ABN , Publish Date - Jan 23 , 2025 | 05:18 AM
అభిషేక్ శర్మ (34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 79) దుమ్మురేపే అర్ధ శతకంతోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (3/23) తిప్పేయడంతో.. ఇంగ్లండ్తో టీ20 సిరీ్సను టీమిండియా ఘనంగా ఆరంభించింది....
వరుణ్ మాయాజాలం
భారత్ అదిరే బోణీ
తొలి టీ20లో ఇంగ్లండ్ చిత్తు
బట్లర్ అర్ధ శతకం వృథా
కోల్కతా: అభిషేక్ శర్మ (34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 79) దుమ్మురేపే అర్ధ శతకంతోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి (3/23) తిప్పేయడంతో.. ఇంగ్లండ్తో టీ20 సిరీ్సను టీమిండియా ఘనంగా ఆరంభించింది. బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. తొలుత ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు కుప్పకూలింది. జోస్ బట్లర్ (44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68) ఒంటరి పోరాటం చేశాడు. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో భారత్ 12.5 ఓవర్లలో 133/3 స్కోరు చేసి గెలిచింది. సంజూ శాంసన్ (26), తిలక్ వర్మ (19 నాటౌట్) సత్తాచాటారు. రెండో టీ20 శనివారం చెన్నైలో జరగనుంది.
బాదుదే.. బాదుడు..
ఛేదనలో ఓపెనర్ అభిషేక్ వీరవిహారంతో.. భారత్ సులువుగా నెగ్గింది. ఎడాపెడా షాట్లతో శర్మ విరుచుకుపడడంతో ఇంగ్లండ్ బౌలర్లకు దిక్కుతోచలేదు. శాంసన్తో కలసి తొలి వికెట్కు 41 పరుగులు జోడించిన అభిషేక్.. తిలక్ వర్మతో మూడో వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీమిండియా మరో 43 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకొంది. ఛేదనను భారత్ ధాటిగానే ఆరంభించింది. రెండో ఓవర్లో అట్కిన్సన్ బౌలింగ్లో శాంసన్ 4,4,6,4,4తో ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో అభిషేక్ 4,6తో జోరు చూపాడు. అయితే, శాంసన్, కెప్టెన్ సూర్యకుమార్ (0)ను ఆర్చర్ అవుట్ చేసి ఝలక్ ఇచ్చాడు. కానీ, తిలక్ సహకారంతో అభిషేక్ చెలరేగి పోయాడు. ఆరో ఓవర్లో అభిషేక్ రెండు సిక్స్లు, బౌండ్రీ బాదడంతో.. భారత్ 63/2తో పవర్ప్లేను ముగించింది. రషీద్ బౌలింగ్లో బతికి పోయిన అభిషేక్ 4,6,6తో 16 పరుగులు పిండుకొన్నాడు. ఇదే జోరులో మరో సిక్స్తో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. దీంతో 10 ఓవర్లకు భారత్ 100/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఇక, విజయానికి 8 పరుగుల దూరంలో ఉండగా.. అభిషేక్ను రషీద్ అవుట్ చేశాడు. కానీ, తిలక్ బౌండ్రీతో మ్యాచ్ను ఫినిష్ చేశాడు.
స్పిన్ ఉచ్చులో చిక్కి..
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ మాయాజాలంతో.. ఇంగ్లండ్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ బట్లర్ మినహా మిగతా బ్యాటర్లు కనీస పోరాటాన్ని కనబర్చలేక పోయారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (0), బెన్ డకెట్ (4)ను అవుట్ చేసిన అర్ష్దీప్.. పవర్ప్లేలోనే ప్రత్యర్థికి షాకిచ్చాడు. కానీ, వన్డౌన్లో వచ్చిన బట్లర్.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బ్రూక్ (17)తో కలసి మూడో వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే, మధ్య ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ పరుగులను కట్టడి చేశారు. ఎనిమిదో ఓవర్లో బ్రూక్, లివింగ్స్టోన్ (0)ను అవుట్ చేసిన చక్రవర్తి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 74/4తో ఒత్తిడిలో పడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా ధాటిగా ఆడుతున్న బట్లర్ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. జాకబ్ బెథెల్ (7)ను పాండ్యా పెవిలియన్ చేర్చాడు. ఓవర్టన్ (2), అట్కిన్సన్ (2)ను అక్షర్ వరుస ఓవర్లలో వెనక్కిపంపాడు. అయితే, 17వ ఓవర్లో చక్రవర్తి బౌలింగ్లో సిక్స్ బాదిన బట్లర్.. ఆ తర్వాతి బంతికి క్యాచవుట్ కావడంతో డెత్ ఓవర్లలో ఇంగ్లండ్ మరింత డీలాపడింది. ఆర్చర్ (12), రషీద్ (8 నాటౌట్) తొమ్మిదో వికెట్కు 21 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో..ఇంగ్లండ్ కష్టంగా 130 మార్క్ దాటింది.
స్కోరు బోర్డు
ఇంగ్లండ్: సాల్ట్ (సి) శాంసన్ (బి) అర్ష్దీప్ 0, డకెట్ (సి) రింకూ (బి) అర్ష్దీప్ 4, బట్లర్ (సి) నితీశ్ (బి) వరుణ్ 68, బ్రూక్ (బి) వరుణ్ 17, లివింగ్స్టోన్ (బి) వరుణ్ 0, బెథల్ (సి) అభిషేక్ (బి) హార్దిక్ 7, ఓవర్టన్ (సి) నితీశ్ (బి) అక్షర్ 2, అట్కిన్సన్ (స్టంప్డ్) శాంసన్ (బి) అక్షర్ 2, ఆర్చర్ (సి) సూర్య (బి) హార్దిక్ 12, రషీద్ (నాటౌట్) 8, మార్క్ ఉడ్ (రనౌట్/శాంసన్) 1; ఎక్స్ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 132 ఆలౌట్; వికెట్ల పతనం: 1-0, 2-17, 3-65, 4-65, 5-83, 6-95, 7-103, 8-109, 9-130; బౌలింగ్: అర్ష్దీప్ 4-0-17-2, హార్దిక్ పాండ్యా 4-0-42-2, వరుణ్ 4-0-23-3, అక్షర్ పటేల్ 4-1-22-2, బిష్ణోయ్ 4-0-22-0.
భారత్: శాంసన్ (సి) అట్కిన్సన్ (బి) ఆర్చర్ 26, అభిషేక్ (సి) బ్రూక్ (బి) రషీద్ 79, సూర్య (సి) సాల్ట్ (బి) ఆర్చర్ 0, తిలక్ వర్మ (నాటౌట్) 19, హార్దిక్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు: 6; మొత్తం: 12.5 ఓవర్లలో 133/3; వికెట్ల పతనం: 1-41, 2-41, 3-125; బౌలింగ్: ఆర్చర్ 4-0-21-2, అట్కిన్సన్ 2-0-38-0, మార్క్ ఉడ్ 2.5-0-25-0, రషీద్ 2-0-27-1, ఓవర్టన్ 1-0-10-0, లివింగ్స్టోన్ 1-0-7-0.

1
టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అర్ష్దీప్.. స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ను వెనక్కునెట్టాడు. 61 మ్యాచ్ల్లో అర్ష్దీప్ 97 వికెట్లు కూల్చగా.. చాహల్ 80 మ్యాచ్ల్లో 96 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ (90), బుమ్రా (89), హార్దిక్ (89) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
షమి బెంచ్కే..
ఏడాది తర్వాత పునరాగమనం చేసిన మహ్మద్ షమికి తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో అతడి ఫిట్నె్సపై మరోసారి అనుమానాలు రేకెత్తాయి. మ్యాచ్ ముందుకు వరకు నెట్స్లో బౌలింగ్ కూడా చేశాడు. కానీ, టాస్ సమయానికి ఫైనల్ లెవన్లో షమి లేకపోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. మోకాలికి కట్టు కట్టుకొనే అతడు నెట్ సెషన్స్లో పాల్గొన్నాడు. అయితే, మోకాలి వాపు ఇంకా తగ్గలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి:
పరువు కాపాడిన జైస్వాల్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు
స్టార్ బౌలర్ కెరీర్ క్లోజ్.. అంతా ప్లాన్ ప్రకారమే
భారత్-ఇంగ్లండ్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ అందులోనే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి