Lioness: షాకింగ్.. రాత్రి వేళ వీధిలో నిద్రిస్తున్న వ్యక్తిని సింహం చూసి..
ABN , Publish Date - Jun 07 , 2025 | 07:23 PM
వీధిలో నిద్రిస్తున్న ఓ వ్యక్తిని సమీపించిన సింహం అతడినేమీ చేయకుండా వెళ్లిపోవడం జనాలను ఆశ్చర్యపరుస్తోంది. వీడియోపై కొందరు రకరకాల సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐ జమానాలో ఏది నిజమో ఏది అసత్యమో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. ఇందుకు తాజా ఉదాహరణగా ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో ఓ సింహం చేసిన పని చూసి జనాలు షాకైపోతున్నారు. వాస్తవం ఏంటో తెలీట్లేదంటూ నోరెళ్లబెడుతున్నారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వ్యక్తి రాత్రి వేళ వీధిలో నిద్రపోతున్నాడు. ఆ సమయంలో అక్కడకు ఓ ఆడ సింహం వచ్చింది. పడుకుని ఉన్న వ్యక్తిని సమీపించింది. కానీ ఆ వ్యక్తి మాత్రం నిద్రలేవలేదు. సింహం మాత్రం కాసేపు అక్కడే నిలబడింది. ఆ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. వ్యక్తి పడకను కూడా వాసన చూసింది. ఇంత జరుగుతున్నా కూడా ఆ వ్యక్తికి మెళకువ రాలేదు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ వీడియో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. సింహం అతడిని ఏమీ చేయకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని అనేక మంది చెప్పుకొచ్చారు. కొందరు మాత్రం వీడియోపై సందేహాలు వ్యక్తం చేశారు. దీన్ని ఏఐ సాయంతో తయారు చేసి ఉండొచ్చని అన్నారు. సింహం అంత సమీపంలో నిలబడినప్పుడు అలికిడికి మెళకువ రాకుండా ఉండటం అసాధ్యమని కొందరు వాదించారు. సింహాలు గుంపులుగా సంచరిస్తాయని, ఇలా ఒంటరిగా తిరగడం తామెప్పుడూ చూడలేదని అన్నారు.
ఇక ఈ ఘటన ఎక్కడ జరిగిందో అని కొందరు ఆరా తీశారు. ఇది భారత్లో జరిగిన ఘటనే అయితే వీడియోలో కనిపించిన ప్రాంతం కచ్చితంగా గుజరాత్లోనిది అయ్యి ఉండాలని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్ ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇటీవల వైరల్ అయిన మరో ఘటనలో ఓ టెకీ బాధ నెటిజన్లను కదిలించింది. జాబ్లో చేరిన తొలి రోజునే రాజీనామా చేసిన అతడికి కంపెనీ భారీ షాకిచ్చింది. రూ.5 లక్షల పరిహారం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో, దిక్కుతోచని స్థితిలో పడిపోయిన సదరు ఐటీ ఉద్యోగి సలహాల కోసం నెటిజన్లను ఆశ్రయించారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేయాలో చెప్పండని అభ్యర్థించారు. జనాలు తమకున్న అనుభవం మేరకు పలు సలహాలు ఇచ్చారు. ఇలాంటి నోటీసులతో టెన్షన్ పడాల్సిందేమీ లేదని అనేక మంది భరోసా ఇచ్చారు.