Share News

Varun- Intel Secrets Leak: ఇంటెల్ సీక్రెట్స్ మైక్రోసాఫ్ట్‌కు లీక్.. అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు భారీ జరిమానా

ABN , Publish Date - Aug 17 , 2025 | 07:00 PM

ఇంటెల్ సంస్థకు చెందిన సీక్రెట్ డాక్యుమెంట్స్‌ను మైక్రోసాఫ్ట్‌కు లీక్ చేసిన కేసులో అమెరికాలోని భారత సంతతి ఏఐ ఇంజినీర్‌కు స్థానిక కోర్టు ఏకంగా 34,472 డాలర్ల జరిమానా విధించింది. రెండేళ్ల పాటు ప్రొబేషన్‌లో ఉండాలని తీర్పు వెలువరించింది.

Varun- Intel Secrets Leak: ఇంటెల్ సీక్రెట్స్ మైక్రోసాఫ్ట్‌కు లీక్.. అమెరికాలో భారత సంతతి ఇంజినీర్‌కు భారీ జరిమానా
Varun Gupta Intel Data Theft

ఇంటర్నెట్ డెస్క్: ఇంటెల్ సంస్థకు చెందిన కీలక సమాచారాన్ని మైక్రోసాఫ్ట్‌కు చేరవేసిన కేసులో ఓ భారత సంతతి ఏఐ ఇంజినీర్‌పై అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. సీక్రెట్స్ లీక్ చేసినందుకు గాను వరుణ్ గుప్తా అనే ఏఐ ఇంజినీర్ 34,472 డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. రెండేళ్ల పాటు ప్రొబేషన్‌లో ఉండాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

ఓరేగాన్ లైవ్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం, ఇంటెల్‌ నుంచి మైక్రోసాఫ్ట్‌ సంస్థకు మారే క్రమంలో వరుణ్ గుప్తా కొన్ని కీలక డాక్యుమెంట్స్‌ను మైక్రోసాఫ్ట్‌కు చేరవేశాడు. 2020లో ఆయన ఇంటెల్‌ను వీడారు. మైక్రోసాఫ్ట్‌లో జాబ్‌ లభించేందుుకు ఆయనకు ఈ సీక్రెట్స్‌ దోహదపడ్డాయని సదరు వార్తా సంస్థ పేర్కొంది. ఆ తరువాత ఇంటెల్‌తో జరిగిన వాణిజ్య చర్చల్లో మైక్రోసాఫ్ట్‌కు వరుణ్ గుప్తా ఇచ్చిన సమాచారం కూడా ఉపయోగపడింది. వరుణ్ కావాలనే పలుమార్లు ఇంటెల్‌కు సంబంధించి గోప్యమైన సమాచారాన్ని సేకరించారని అసిస్టెంట్ యూఎస్ అటార్నీ విలియమ్ నారస్ పేర్కొన్నారు. వరుణ్‌కు కనీసం 8 నెలల ఫెడరల్ జైలు శిక్ష విధించాలని కోరారు.


అయితే, వరుణ్ తరుపు లాయర్లు మాత్రం జైలు శిక్ష వద్దని వాదించారు. సీక్రెట్ డాక్యుమెంట్స్ చోరీ చేసినందుకు వరుణ్ ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకున్నారని అన్నారు. టెక్ సంస్థల్లో సీనియర్ ఉద్యోగ బాధ్యతలకు ఆయన శాశ్వతంగా దూరమయ్యారని అన్నారు. ఈ విషయంలో ఆయన గతంలోనే 40 వేల డాలర్లు చెల్లించి ఇంటెల్‌తో సివిల్ దావాను సెటిల్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. చేసిన నేరానికి ఈ శిక్ష చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే, న్యాయమూర్తి మాత్రం ఈ కేసు విషయంలో మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారు. జైలు శిక్ష విధించేందుకు నిరాకరించిన న్యాయమూర్తి వరుణ్‌కు జరిమానా తప్పదని స్పష్టం చేశారు. ఆయన 34,472 డాలర్ల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించారు. వరుణ్ దుష్ప్రవర్తన తీవ్రత దృష్ట్యా ఇంతటి జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఆయన తన పరువు పోగొట్టుకున్నారని, ఇది కూడా భారీ శిక్షే అని అభిప్రాయపడ్డారు. కాగా, కోర్టు ఆదేశాల మేరకు జరిమానా చెల్లించిన వరుణ్ తన కుటుంబంతో సహా ఫ్రాన్స్‌కు వెళ్లిపోయినట్టు ఓరేగాన్ లైవ్ వార్తా సంస్థ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి:

తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ఎడారి జలవనరుల విధాన పరిశీలనకు రండి.. ఏపీ మంత్రికి ఎన్నారై ఆహ్వానం

Read Latest and NRI News

Updated Date - Aug 17 , 2025 | 07:10 PM