Tourist Visa: టూరిస్టు వీసాకు దరఖాస్తు చేస్తున్నారా.. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుండాలంటే..
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:36 PM
టూరిస్టు వీసా దరఖాస్తుదారుల బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇమిగ్రేషన్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో వివిధ దేశాల టూరిస్టు వీసా జారీకి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ అవసరమో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: టూరిస్టు వీసా కోసం దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు తమ బ్యాంక్ బ్యాలెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా దేశాలు వీసా మంజూరు చేసే ముందు మీ దగ్గర సరిపడా డబ్బు ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తాయి. రానూపోను ప్రయాణం, హోటల్ రిజర్వేషన్లు వంటి వాటికి సరిపడా డబ్బు ఉందని టూరిస్టులు నమ్మకం కలిగించాలి. ఈ దిశగా బ్యాంక్ స్టేట్మెంట్లు, జీతం రసీదులు, ట్రావెల్ ప్లాన్స్, ఇన్సూరెన్స్ వంటి డాక్యుమెంట్స్ను కూడా వీసాకు దరఖాస్తు చేసుకునేటప్పుడు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఇమిగ్రేషన్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్నీ సరి చూసుకున్నాకే వీసా జారీ చేస్తారు.
బ్యాంకు బ్యాలెన్స్కు సంబంధించి నిబంధనల్లో వివిధ దేశాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు, కెనడా టూరిస్టూ వీసా కోసం దరఖాస్తుదారులకు రూ3 నుంచి రూ.6 లక్షల వరకూ బ్యాంక్ బ్యాలెన్స్ అవసరం. ఆస్ట్రేలియా వీసాకు రూ.2.5 – రూ. 5 లక్షలు ఉండాలి. ఇక జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి షెంజెన్ దేశాల్లో రోజుకు 100–120 యూరోల మేర ఖర్చు చేయగల స్థాయిలో అభ్యర్థులకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఇక శ్రీలంకలో పర్యటించేందుకు ₹80,000 నుంచి రూ.1.6 లక్షల వరకూ బ్యాంక్ బ్యాలెన్స్ అవసరం, అమెరికాలో పర్యటించేందుకు రూ.5 నుంచి రూ.8 లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఉండాలి. వీటితో పాటు ఇతర పత్రాలన్నీ పక్కాగా ఉంటేనే వీసా జారీ అవుతుంది.
కాబట్టి, వీసా కోసం దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు ఈ నిబంధనల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తమ బ్యాంక్ ఖాతాలో సరిపడా మొత్తాన్ని సిద్ధం చేసుకోవాలి. దీంతో, పాటు టూర్కు సంబంధించి పక్కా ప్లాన్ చేసుకోవాలి. ట్రిప్ ప్లాన్, హోటల్ బుకింగ్స్, రిటర్న్ టికెట్ సమాచారం ఉంటే టూర్ తరువాత స్వదేశానికి తిరిగొచ్చేందుకు వీసా దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నట్టు భావిస్తారు. వీసా జారీలో ఆలస్యం కాకుండా ఉండాలంటే అన్ని డాక్యుమెంట్స్ను ఒకటికి రెండు సార్లు సరి చూసుకుని ఎలాంటి దోషాలు లేని విధంగా సమర్పిస్తే త్వరగా టూరిస్టు వీసా వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఈ వార్తలనూ చదవండి:
ప్రముఖ ఎన్నారై వైద్యుడు డా. పొలిచెర్ల హరనాథ్కు పౌర సన్మానం
డల్లాస్లో ఎన్నారై టీడీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు