Saudi Arabia: సౌదీలో తెలంగాణ ప్రవాసీ హత్య!
ABN , Publish Date - Mar 02 , 2025 | 06:40 PM
మద్యం మత్తులో జరిగిన వాగ్వివాదం కారణంగా ఓ తెలంగాణ ప్రవాసీ తోటి ఎన్నారై చేతిలో హత్యకు గురయ్యాడు. సౌదీలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలో మినీ తెలంగాణగా ప్రాచుర్యం పొందిన ప్రాంతంలో త్రాగిన మైకంలో వాగ్వివాదం తీవ్రం కావడంతో తెలంగాణ ప్రవాసీ ఒకరు తన సహచరుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
సౌదీ అరేబియాలోని దమ్మాం నగరంలో తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో నివసించే సికో బిల్డింగ్ ప్రాంతంలో నివాసముండే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండం పోశానిపేట గ్రామానికి చెందిన గుంట హన్మంతు అనే ప్రవాసీ తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యాడనే విషయం వెలుగులోకి వచ్చింది. వీసా గడువు ముగిసి అక్రమంగా దేశంలో ఉంటున్న అతను నిర్మాణ రంగంలో కూలీ పనులు చేసుకొంటున్నాడు (NRI).
NRI: గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు.. ఏం చేశారంటే..
హన్మంతుతో పాటు అదే గదిలో ఉంటున్న మరో తెలంగాణ ప్రవాసీయుడికి మధ్య వాగ్వివాదం జరగ్గా హన్మంతు కత్తిపోట్లకు గురయి అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం.
ఈ కేసులో పోలీసులు అనేక మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని సమాచారం. కాగా హత్య జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసీయులు వీసా గడువు ముగిసి అక్రమంగా ఉంటున్న నేపథ్యంలో అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మినీ తెలంగాణలో పిలువబడే ఈ ప్రాంతంలో ఒక భారతీయుడు అందునా తెలుగు ప్రవాసీ హత్యకు గరికావడం ఇదే మొదటిసారి.