Share News

NTR: బహ్రెయిన్‌‌లో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

ABN , Publish Date - May 13 , 2025 | 09:28 PM

అరేబియాలోని చిరు ద్వీకల్ప దేశమైన బహ్రెయిన్‌లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను ఎన్నారై తెలుగుదేశం, యన్.బి.కె సేవా సమితిల అధ్వర్యంలో ఇటీవల ఘనంగా నిర్వహించారు.

NTR: బహ్రెయిన్‌‌లో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు
NTR Cine Diamond Jubilee

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ప్రపంచ వ్యాప్తంగా మహానటుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను ప్రవాసీయులు అంగరంగ వైభవంగా జరుపుకొంటున్నారు. ఎడారి అరేబియా దేశాలలో ఉన్న అసంఖ్యాక తెలుగు ప్రవాసీ లోకం కూడా ఎన్టీఆర్‌ను స్మరించుకుంటుంది. అరేబియాలోని చిరు ద్వీకల్ప దేశమైన బహ్రెయిన్‌లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను ఎన్నారై తెలుగుదేశం, యన్.బి.కె సేవా సమితిల అధ్వర్యంలో ఇటీవల ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ , ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, తెలుగుదేశం పాలిట్‌బ్యూరో సభ్యులు టి.డి.జనార్దన్‌, సినీ నటి కళారత్న ప్రభ రమేష్ , ఎన్టీఆర్ బంధవులు నందమూరి బెనర్జీ, నందమూరి బిజిలి, స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కే పట్టాభిరామ్, ఆర్య వైశ్య కమిటి చైర్మన్ డూండి రాకేష్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ, ప్రముఖ గాయకులు రాము, నాద ప్రియ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

అతిథులను ఈ కార్యక్రమంలో శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. బహ్రెయిన్ తెలుగు దేశం కార్యవర్గ సభ్యులు, ఇతర తెలుగు సంస్థలు, తెలుగు ఎకో వారియర్స్, సహయసహకారాలతో ఈ వేడుకల నిర్వాహణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, తెలుగుదేశం పాలిట్‌బ్యూరో సభ్యులు టి.డి.జనార్దన్‌ మాట్లాడుతూ.. ‘‘మన అన్నగారి శతజయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని ప్రతి దేశంలో జరుపుకుంటున్నాం.

2.jpg


జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కథా నాయకుడు, మహా నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు. రాజకీయ, సినీ రంగాల్లో చెరగని ముద్ర వేశారు అన్నగారు. మనకు రాముడు, కృష్ణుడు తెలుసు, అలాగే రావణ శకం తెలుసు, శాలివాహన రాజులు తెలుసు. ఆ తర్వాత తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకునేది, గుండెల్లో పెట్టుకునేది ఎన్టీఆర్‌నే. ఆయన తన సినిమాల ద్వారా మంచి సందేశాన్ని సమాజానికి అందించారు. ఎన్టీఆర్ గారు సినిమాల్లో నటించేవారు అనే కన్నా జీవించారు అని చెప్పడం కరెక్ట్. రాజకీయాల్లో ఆయన ఏం చెప్పారో అదే చేశారు. ప్రజా నాయకుడిగా మనసులు గెల్చుకున్నారు’’ అని అన్నారు

నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించిన బహ్రెయిన్ తెలుగు దేశం సభ్యులకు కృతజ్ఞతలు. సినీరంగంలో ఎన్టీఆర్ ఖ్యాతిని మరో నటుడు అందుకోలేరు. ఆయన తను నటించే పాత్రల్లో జీవించేవారు. ఆ క్యారెక్టర్స్‌ను అర్థం చేసుకునేవారు. ఒక్కో సినిమాలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి కూడా ప్రేక్షకుల్ని మెప్పించారు. మరో నటుడికి సాధ్యం కాని ఎన్నో ఘనతలు ఎన్టీఆర్ వెండితెరపై సుసాధ్యం చేశారు. కుటుంబంలో శుభకార్యాల కంటే ప్రజల క్షేమమే ముఖ్యం అని ఎప్పుడు చేప్పేవారు’’ అని తెలియజేశారు. తన అన్న బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అని, కళా రంగంలోనే కాకుండా సేవా రంగం, రాజకీయ, వైద్య రంగాల్లో కూడా అనేక గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారని అన్నారు.

3.jpg

ప్రముఖ నటి ప్రభ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ గారి జీవితంలోని ఎన్నో విశేషాలతో తారకరామం అనే పుస్తకం రాయడం అభినందనీయం. ఎన్టీఆర్ నటుడిగా ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద పాత్రలతో ప్రేక్షకుల్లో మనసుల్లో చిరస్మరణీయులు అయ్యారు. ఆయన రాముడిగా, కృష్ణుడిగా, రావణాసురుడిగా, దుర్యోధనుడిగా.. ఇలా ఎన్నెన్నో పౌరాణిక పాత్రలతో గుర్తుండిపోయారు. ఎన్టీఆర్ పిల్లలు కూడా ఆయన వారసత్వాన్ని ఘనంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. పురంధేశ్వరి గారు ఢిల్లీ రాజకీయాల్లో గొప్ప స్థాయిలో ఉండటం మనందరికీ గర్వకారణమం’’ అని అన్నారు.


స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కే పట్టాభిరామ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయకత్వంలో ఎటువంటి మచ్చ లేని, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలుగు ఈకో వారియర్స్ ఆధ్వర్యంలో 65 వారాలుగా స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ప్రతి శుక్రవారం బీచ్‌లలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం చేస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు.

ఆర్య వైశ్య కమిటి చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదల తో పని చేసే నాయకుడు నారా లోకేష్ అని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో యువత ఉపాధి పెరుగుతుందని అన్నారు. బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కు పొట్టి శ్రీరాములు కారణం అయితే తెలుగు వారి ఉనికిని చాటి చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు.

తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా, యువతకు ఉపాధి దొరకాలన్నా తెలుగుదేశం నిరంతరం అధికారంలో ఉండాలని అన్నారు. మరోసారి అధికారంలోకి రావడానికి మనమంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని చెప్పారు.

NRI తెలుగు దేశం గల్ఫ్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ మాట్లాడుతూ గత ఎన్నికల విజయంలో ఎన్నారైల పాత్ర అభినందనీయమని అన్నారు. ఎన్నికల కోసం సొంత డబ్బులతో ఆంధ్రకు వచ్చిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.

NRI తెలుగు దేశం గల్ఫ్ కమిటీ సభ్యులు కోడూరి వెంకట్ మాట్లాడుతూ తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నిలిపిన అన్న ఎన్టీఆర్‌కు వెంటనే భారత రత్న ఇవ్వాలని కోరారు. అధికారం కోసం కష్టపడ్డ ఎన్నారైలకు కూడా పార్టీ లోను, ప్రభుత్వం లోను సముచిత స్థానం ఇస్తే పూర్తి సేవాభావంతో ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమం నిర్వహించిన ఎన్నారై టీడీపీ బహ్రెయిన్ అధ్యక్షులు రఘునాథ్ బాబు, హరిబాబు తక్కెల్లపాటి, ఆర్ఎస్ఎస్ మురళి కృష్ణ, కే. రాజశేఖర్, డీవీ శివ కుమార్, రామ్ మోహన్ కొత్తపల్లి, అనిల్ ఆరె, సతీష్ శెట్టి, పూర్ణ, నాగార్జున బాబు, ఇంతియాజ్, సతీష్ బోల్ల, ఏవీ రావు, పీజే నాయుడు, చంద్రబాబు, అనిల్ పమిడి, యుగంధర్, అశోక్, ప్రవీణ్ చావా, మహేష్ మీరా, స్వాతి, శ్రవంతి, ఉషారాణి, వంశీ, సందీప్, హరిప్రియ, శ్రీకాంత్, శ్రీ వాణి, కోటేశ్వరరావు, అమరావతి అవెంజర్స్ క్రికెట్ టీం సభ్యులు అందరినీ ప్రతి ఒక్క అతిథి ప్రత్యేకంగా అభినందించారు.

అతిథులను ఈ కార్యక్రమంలో శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. బహ్రెయిన్ తెలుగు దేశం కార్యవర్గ సభ్యులు, ఇతర తెలుగు సంస్థలు, తెలుగు ఎకో వారియర్స్, సహయసహకారాలతో ఈ వేడుకల నిర్వాహణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్నారై వింగ్ గ్లోబల్ నెట్‌వర్క్ వైస్ ఛైర్మన్ అశ్విన్ అట్లూరి పర్యవేక్షణలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి .

4.jpgఇవి కూడా చదవండి:

ఐర్‌లాండ్‌లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు

ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా

SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం

బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు

Read Latest and NRI News

Updated Date - May 14 , 2025 | 04:18 PM