NTR: ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా
ABN , Publish Date - May 06 , 2025 | 10:08 PM
అరేబియాలో అగ్రదేశమైన సౌదీ అరేబియాలో కూడా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సన్నహాలు ఊపందుకొన్నాయి. అక్కడి ఎన్నారైలు ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మహానుభావుడు ఎన్టీఆర్ ఘన చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా... ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజానీకం 'ఎన్టీఆర్ శతజయంతి' ఉత్సవాలను నిర్వహించుకొంటుండగా అరేబియాలో అగ్రదేశమైన సౌదీ అరేబియాలో కూడా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సన్నహాలు ఊపందుకొన్నాయి. కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు కొందరు అధికార, రాజకీయ ప్రముఖులు రానుండడంతో దీనికి ప్రాముఖ్యత మరింత పెరిగింది.
ప్రస్తుత ప్రవాసీ యువతరానికి ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్ధానం గురించి ప్రత్యక్ష అనుభవం లేకున్నా చరిత్ర మరువని అజరామరుడి గురించి తెలియింది ఎవరికి? అందుకే, సౌదీ అరేబియాలోని దమ్మాంలో మే 9న (శుక్రవారం) జరుగున్న ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశ వ్యాప్తంగా దూర ప్రాంతాల నుండి ఎన్టీఆర్ అభిమానులు రానున్నారు. 1500 కిలోమీటర్ల దూరంలో పని చేసే విశాఖపట్టణానికి చెందిన షబ్బీర్ ఆసక్తిగా వస్తుండగా... ఎన్టీఆర్ రాజకీయ ప్రభావాన్ని ఏ మాత్రం చూడని చంటి పిల్లాడిగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన 30 ఏళ్ళ అద్దంకి కిషోర్ నిద్రాహారాలు మాని కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమం కావడం, అసలు ఎడారి దేశంలో వేలాది మంది సాక్షిగా ఎన్టీఆర్ గురించి ఆయన అభిమానులు ఏమాంటారో అని తెలుసుకోవడానికి భారతదేశం నుండి వచ్చి అతృతగా ఎదురు చూస్తున్న 76 ఏళ్ళ నందమూరి బెనర్జీ చౌదరిలను చూస్తే ఎన్టీఆర్ ప్రభంజనం ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ గురించి తనకు తెలియదని, కానీ తన తండ్రికి ఆయన దైవ సమానుడని అందుకే తాను కూడా వీరభిమానని కిషోర్ చెప్పారు. రాజధాని నగరం రియాద్లో పరస్పరం కలహించుకొనే ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా కార్యక్రమంలో పాల్గొనడానికి దమ్మాంకు భారీ సంఖ్యలో వెళ్ళడానికి చురుగ్గా సన్నాహాలు చేసుకొంటున్నారు.
ఇక, తెలుగు ప్రవాసీల సంఖ్య అధికంగా ఉన్న దమ్మాం, అల్ ఖోబర్ జంట నగరాలలోని అత్యధిక తెలుగు కుటుంబాలలో గత కొన్ని రోజులుగా పండుగ వాతావరణం నెలకొని ఉంది. అనేక కుటుంబాలు తమ తమ వ్యక్తిగత పర్యటనలను వాయిదా వేసుకోని మరీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తమ ఇంట శుభకార్యం ఉన్నట్లుగా మహిళలు ఒకరికొకరు ఫోన్లు చేసి మరీ ఆహ్వానించుకొంటున్నారు. విశాఖపట్టణానికి చెందిన అనిత చందగానీ, హైదరాబాద్ నగరానికి చెందిన కశ్మీరా రోహిత్ల దర్శకత్వంలో సాంస్కృతిక ప్రదర్శనల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎల్లప్పటికీ శాశ్వత హిట్ సినిమా దాన వీర శూర కర్ణ మహానటుడి నటన విశిష్ఠతను స్మరించుకొనే క్రమంలో స్థానిక ప్రవాసీయులు తమ నటనా కళలను ప్రదర్శించనున్నారు. అందులో చిన్నారుల నుండి పెద్దల వరకు ఉన్నారు. భీమవరానికి చెందిన రెండున్నర సంవత్సరాల విక్రమ్ వర్మ కలిదిండి నుండి, హైదరాబాద్కు చెందిన ఆరుపదుల వయస్సు కల్గిన వారు కూడ ఉన్నారు.
తెలుగు ప్రవాసీ సంఘమైన సాట్స్ ఈ కార్యక్రమ నిర్వహణలో ముఖ్య భూమిక వహిస్తుండగా, దీనికి తెలుగు ప్రవాసీ ప్రముఖులు కోనేరు ఉమా మహేశ్వర రావు, వరప్రసాద్లు నేతృత్వం వహిస్తున్నారు. సౌదీ అరేబియాలోని అన్ని ప్రాంతాలలోని తెలుగు ప్రవాసీ సంఘాల సౌజన్యంతో తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వరప్రసాద్, ఉమా మహేశ్వరరావులు పేర్కొన్నారు. ఇది ప్రతి ఒక్క తెలుగోడి కార్యక్రమమని వారు వ్యాఖ్యానించారు. కార్యక్రమ వివరాలకు వరప్రసాద్కు 0530110776 పై సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి:
SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం
బహ్రెయిన్లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్