Janasena: సౌదీ అరేబియాలో పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సభ
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:15 PM
సౌదీ అరేబియాలోని జన సేన అభిమానులు వినూత్న రీతిలో తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. జనసేన వీర మహిళలు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పవర్ స్టార్ పవనీజం ఎక్కడయినా పవరే... అది గోదావరి పొంగిపొర్లే ఆంధ్రా అయినా ఇసుక కణాల ఘర్షణల శబ్దం ధ్వనించే అరేబియా ఎడారులైనా, పవన్ కళ్యాణ్ అభిమానులకు కొదవలేదు. అందునా ఉభయ గోదావరి జిల్లాల్లో స్త్రీపురుష భేదాలు, ధనిక పేద అంతరాలకు అతీతంగా పవన్ నామస్మరణ చేసే అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు.
ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జన సేన అభిమానులు వినూత్న రీతిలో తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఇళ్లల్లో శుభకార్యానికి ఆహ్వానించినట్లుగా రియాద్ నగరంలోని ప్రవాసాంధ్ర కుటుంబాలను బొట్టుపెట్టి మరీ వీర మహిళలు ఆహ్వానించడమే కాకుండా కార్యక్రమ నిర్వహణలో ముందున్నారు. ఒక రాజకీయ పార్టీకి మహిళా అభిమానులు ఈ రకంగా ముందుండి కార్యకలాపాలు నడిపించడం విశేషమని చెప్పవచ్చు. వీర మహిళలు దుగ్గరపు ఉషా, చేతన అన్ని తామై కార్యక్రమాన్ని నిర్వహించారు.
అందరికీ కావాల్సిన వాడనిపించుకునే మురారి తాటికాయల (తణుకు) జనసేన అధ్యక్షుడిగా అందర్నీ ఏకతాటిపై నడిపించి కార్యక్రమాన్ని నిర్వహించి తాను నాయకుడని అనిపించుకున్నారు. విభిన్న పరస్పర వైరుధ్యాలు కలిగిన తెలుగు సమూహాలను ఆయన సమీకరించగలిగారు. ఉదయం సభ మొదలయిన క్షణం నుండి రాత్రి వరకు మురారి అనుచరులు చేసిన హడావుడి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. మురారికి తోడుగా నాయకులు జి. ఆనందరాజు, యోగేశ్ వీరవల్లి, రావూరి శ్రీనివాస్, ఎర్రన్న , గురుకిరణ్ మొత్తం కార్యక్రమ నిర్వహణను అన్నీ తామై నిర్వహించారు. దేవతలను ఆదరించే సమాజంలో మహిళలకు పెద్దపీట వేసే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఉషా తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.
సాధారణంగా సభల సందర్భంగా సభికులకు క్యాటరింగ్ కంపెనీల నుండి భోజనాలు సరఫరా చేస్తుంటారు. కానీ ఈ రకంగా చేస్తే ఆప్యాయత కరువవుతుందని భావించిన జనసేనాని రావూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాఘువ చౌదరి, నాని, అయ్యప్ప, రెడ్డి రాయల్, పేకేటి అర్జున్, లక్కుసాయి, శ్రీను, గోవింద్, ఏడుకొండలు, నాయుడు, రాజు, అప్పాజీ తదితరులు తామే భోజనాలు వంటవార్పు చేసి మరీ వడ్డీంచారు. వీరిని సభ వేదికపై ప్రత్యేకంగా ఆహ్వనించి అందరికీ పరిచయం చేశారు.

అంతకుముందు రికార్డు స్థాయిలో జనసేన కార్యకర్తలు రక్తదానం చేయగా, దాతలందరికీ ప్రశంస పత్రాలను అందించారు. మరో వీర మహిళ కోకిల తన సినీ గేయాలతో సభికులను అలరించారు. తెలుగు ప్రవాసీ ప్రముఖులు స్వర్ణ స్వామి, ముజ్జమీల్ షేఖ్, ఆంటోనీ, రమ్య, శ్రీనివాస్ మచ్చ, అంకబోతుల గౌరి శంకర్ (దమ్మాం) తదితరులు పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమ నిర్వహణలో ఉభయ గోదావరి జిల్లాల ప్రవాసాంధ్రుల ప్రాబల్యం స్పష్టంగా కనిపించింది. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు కూడా కార్యక్రమానికి హజరుకావడం విశేషం. జనసేన నాయకుడు అమేర్ ఖాన్ మాత్రం అనారోగ్య కారణాల వలన కార్యక్రమంలో పాల్గొనలేకపోయారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలోని విభిన్న వర్గాల అధిపత్య పోరు కూడా ఈ సందర్భంగా బహిర్గతమైంది.
పరస్పర వైరుధ్యం కలిగిన వివిధ తెలుగు సంఘాలన్నీ జనసేనపై అభిమానంతో హజరు కావడంతో సభ అంచనాలకు మించి విజయవంతమైందని చెప్పవచ్చు. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందని కూడా కొందరు వ్యాఖ్యానించారు.








ఈ వార్తలు కూడా చదవండి.
బెతూనే ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు బ్యాక్ ప్యాక్లు పంపిణీ
మళ్లీ ఉదారత చాటుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
For More NRI News And Telugu News