Indians in Foreign Countries: విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల కోసం కొత్త చట్టం తేనున్న కేంద్రం!
ABN , Publish Date - Feb 06 , 2025 | 09:58 PM
విదేశాల్లో పని చేస్తున్న భారతీయుల కోసం కేంద్రం ప్రస్తుతమున్న ఎమిగ్రేషన్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉంది.

విదేశాల్లో పని చేసే భారతీయుల కోసం కేంద్రం కొత్త చట్టం చేసే విషయంపై దృష్టి పెట్టినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగ వ్యాపారాల కోసం విదేశాలకు చట్టబద్ధమైన, క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించే దిశగా ఈ చట్టాన్ని తేనున్నట్టు సమాచారం. ఓవర్సీస్ మొబిలిటీ బిల్ 2024 పేరిట ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. కాలం చెల్లిన 1983 ఎమిగ్రేషన్ యాక్ట్ స్థానంలో ఈ చట్టం తెచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ ఇటీవల లోక్సభ ముందుంచిన నాలుగో నివేదికలో కూడా ఈ ముసాయిదా చట్ట ప్రస్తావన ఉంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ట్రంప్ సర్కారు చేతులు, కాళ్లకు సంకెళ్లు వేసి మరీ స్వదేశానికి తరలిస్తున్న వేళ కొత్త చట్టంపై ఆసక్తి వ్యక్తమవుతోంది (NRI).
SATA: సౌదీలో ఇద్దరు ఆంధ్రులను ఆదుకున్న మానవతామూర్తులు
అక్రమవలసదారుల తరలింపులో భాగంగా తొలి విడతగా 104 మంది భారతీయులు బుధవారం అమెరికా మిలిటరీ విమానంలో అమృతసర్కు చేరుకున్నారు. భారత్కు వచ్చిన వారిలో 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అక్రమంగా వలసొచ్చిన భారతీయులను అమెరికా ఈస్థాయిలో వెనక్కు పంపించడం ట్రంప్ గద్దెనెక్కాక ఇదే తొలిసారి. తమ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి వెనక్కు తీసుకొచ్చారంటూ కొందరు భారతీయులు మీడియాకు తెలిపారు. దీంతో, ఈ ఉదంతంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అత్యంత అమానవీయమని మండిపడింది.
ఈ అంశంపై లోక్సభలో ప్రతిపక్షాల నిరసన నడుమ విదేశాంగ శాఖ మంత్రి వివరణ ఇచ్చారు. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి తరలించడం అమెరికా పోలీసులు పాటించే ప్రామాణిక పద్ధతి అని పేర్కొన్నారు. కానీ మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదని స్పష్టం చేశారు. అయితే, భారతీయులతో అమెరికా పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించేలా చర్యలు తీసుకునేందుకు తాము ట్రంప్ సర్కార్తో చర్చిస్తున్నామని భరోసా ఇచ్చారు. ఇక అమెరికా భారత్కు తరలించిన వారిలో హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్కు చెందిన మరో 33 మంది, 30 మంది పంజాబీలతో పాటు ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. అమెరికా పోలీసులకు చిక్కిన భారతీయుల్లో అధిక శాతం మంది మెక్సికో సరిహద్దు వద్ద పట్టుబడ్డారని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్లో వీరిపై కేసులేమీ లేవని, వారు చట్టబద్ధంగా దేశాన్ని దాటినా డాంకీ రూట్ ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించబోయి పట్టుబడినట్టు సమాచారం. ఇక అమెరికాలోకి అక్రమంగా వలసొచ్చిన 18 వేల మందితో అమెరికా అధికారులు జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.