The Dark Web of iBomma: అమ్మో ఐ బొమ్మ
ABN , Publish Date - Oct 05 , 2025 | 02:53 AM
ప్రపంచంలో సినిమాను ప్రేమించే ప్రేక్షకులు ఉన్నంత కాలం, పైరసీ అనే భూతం వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమను వణికిస్తున్న అలాంటి పైరసీ వెబ్సైట్లలో ‘ఐ బొమ్మ’ ఒకటి...
ప్రపంచంలో సినిమాను ప్రేమించే ప్రేక్షకులు ఉన్నంత కాలం, పైరసీ అనే భూతం వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమను వణికిస్తున్న అలాంటి పైరసీ వెబ్సైట్లలో ‘ఐ బొమ్మ’ ఒకటి. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కొత్త సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది గంటల్లోనే, లేదా ఓటీటీలోకి వచ్చిన మరుక్షణమే హై - క్వాలిటీ ప్రింట్తో ఈ సైట్లో ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. అయితే ఈ ఉచిత వినోదం తెలుగు సినిమా నిర్మాతలకు రూ. వేల కోట్ల నష్టం తెస్తోంది.
పైరసీ మాఫియా
‘మూవీ రూల్స్, ఐ బొమ్మ లాంటి సైట్స్ కేవలం సినిమాలను అప్లోడ్ చేసే వేదికలు మాత్రమే కాదు. దీని వెనుక ఒక పకడ్భందీ వ్యవస్థ ఉంది. అంతర్జాతీయ నెట్వర్క్ పనిచేస్తోంద’ని సైబర్క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. పైరసీ వల్ల తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఒక్క 2024లోనే పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు రూ. 3700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని మాజీ హైదరాబాద్ పోలీస్ క మిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
చిన్న సినిమాల పాలిట విలన్
భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలకు ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా కొంతమేర నష్టం తగ్గినా, పైరసీ వల్ల అత్యధికంగా నష్టపోతున్నది మాత్రం చిన్న సినిమాలే. పలు సందర్భాల్లో చిన్న నిర్మాతలు, దర్శకులు వెలిబుచ్చిన ఆవేదన దీనికి అద్దం పడుతోంది. ‘మా కలలను, మా పెట్టుబడినీ పైరసీ చంపేస్తోంది. మా పెట్టుబడిలో ఒక్క పైసా కూడా తిరిగి రావడం లేదు. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే మరో సినిమా ఎలా తీయగలం’ అని చిన్న నిర్మాతలు, దర్శకులు ప్రశ్నిస్తున్నారు. థియేటర్ల ద్వారా పెట్టుబడిలో కొంతైనా రాబట్టుకోవాలని చూసే చిన్న నిర్మాతల ఆశలపై ఐ బొమ్మ నీళ్లు చల్లుతోందనడంలో సందేహం లేదు. అలాగే పైరసీ అనేది థియేటర్ల ఆదాయంతో పాటు ఓటీటీ రెవెన్యూను సైతం దెబ్బతీస్తోంది. థియేటర్లలో విడుదలతో పాటు ఓటీటీల ఆదాయానికి ఐ బొమ్మ లాంటి సైట్లు గండికొడుతున్నాయి.
పోలీసులకు సవాల్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎ్ఫసీసీ) ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మతో సహా 65కు పైగా పైరసీ వెబ్సైట్లపై దర్యాప్తును మమ్మురం చేశారు. ఐ బొమ్మపై దృష్టి సారించిన హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్లో భాగమైన కొందరు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. దాని నిర్వాహకులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పైరసీ రాకెట్ హైదరాబాద్తో పాటు దుబాయ్, నెదర్లాండ్ వంటి విదేశీ ప్రాంతాల నుంచి పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పైరసీముఠా కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, రికార్డింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్, మానిటైజేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఛేజింగ్ గేమ్
ఐ బొమ్మ లాంటి పైరసీ సైట్లు తమ డొమైన్లను తరచూ మార్చడం, సర్వర్లు విదేశాల్లో ఉండడం వల్ల వాటిని శాశ్వతంగా మూసివేయడం పోలీసులకు, పైరసీ సెల్లకు పెద్ద సవాల్గా మారింది. ఒక డొమైన్ను బ్లాక్ చేస్తే కొద్ది రోజుల్లోనే అది కొత్త పేరుతో కొత్త లింక్తో మళ్లీ ప్రత్యక్షమవుతోంది. ఇంటర్నెట్ ప్రపంచంలో ఇదొక అంతుచిక్కని ‘ఛేజింగ్ గేమ్’గా మారిపోయింది.
పరిష్కారం ప్రేక్షకులు చేతుల్లోనే!
పైరసీని పూర్తిగా రూపుమాపడం కష్టమే అయినా, సినీ పరిశ్రమ, ప్రభుత్వం, ప్రేక్షకులు కలసి పోరాడాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా మారాల్సింది ప్రేక్షకులే. పైరసీ లింక్లను ప్రోత్సహించకుండా, నాణ్యమైన వినోదం కావాలంటే థియేటర్లలో చూడడం, చట్టబద్ధమైన ఓటీటీ వేదికలను ఆదరించడం ఒక్కటే ఈ భూతం నుంచి తెలుగు సినిమాను రక్షించే మార్గం. వేలమంది కళాకారులు, సాంకేతిక నిపుణుల కష్టం, కలలకు ప్రతిరూపమైన సినిమాను పైరసీ కోరల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్షాప్లు: పీఎం మోదీ