Share News

పుష్కర సరస్వతి

ABN , Publish Date - May 09 , 2025 | 01:53 AM

నదులను దేవతలుగా భావించి, పూజించే సంస్కృతి మనది. మన జీవన అవసరాలను తీర్చే నదులకు కృతజ్ఞతలు తెలుపుకొనే సంప్రదాయాన్ని పుష్కరాల రూపంలో పూర్వులు నిర్దేశించారు. తదనుగుణంగా...

పుష్కర సరస్వతి

సమాచారం

నదులను దేవతలుగా భావించి, పూజించే సంస్కృతి మనది. మన జీవన అవసరాలను తీర్చే నదులకు కృతజ్ఞతలు తెలుపుకొనే సంప్రదాయాన్ని పుష్కరాల రూపంలో పూర్వులు నిర్దేశించారు. తదనుగుణంగా ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు... ఒక్కొక్క నదికి పుష్కరాలు జరుగుతాయి. పన్నెండు ప్రధాన నదులకు... పన్నెండేళ్ళకు ఒక్కోసారి పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కర నదుల్లో సరస్వతి ఒకటి. మిగిలిన నదుల్లా కాకుండా అంతర్వాహినిగా ప్రవహించడం ఈ నది ప్రత్యేకత. ఋగ్వేదంలో, పురాణాల్లో సరస్వతీ నది ప్రస్తావన ప్రముఖంగా ఉంది. పవిత్రమైన సప్త నదుల్లోనూ సరస్వతికి విశిష్ట స్థానం ఉంది. అందుకే, స్నానం చేసినప్పుడు... గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ... నర్మదే సింధు కావేరీ జలేస్మిన్‌ సన్నిధిం కురు... అంటూ ఈ నదులను తలచుకోవడం పుణ్యప్రదమని చెప్పారు పెద్దలు. బృహస్పతి మిధున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. ఈ ఏడాది మే 15 నుంచి 26వ తేదీ వరకూ పన్నెండు రోజుల పాటు సరస్వతీ నదికి పుష్కరాలు జరగబోతున్నాయి.


ఎక్కడ?: సరస్వతీ నది పుట్టిన చోటుగా పరిగణించే ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని బదరీనాథ్‌ సమీపంలో ఉన్న మానా గ్రామంలో పుష్కర స్నానాల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరస్వతీ నది... అలకనంద నదికి ఉపనది. కేశవ ప్రయాగ దగ్గర అలకనందలో కలుస్తుందంటారు. అలాగే సరస్వతీ నది అంతర్వాహినిగా... ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో, గుజరాత్‌లోని సోమనాథలోని త్రివేణీ సంగమాల్లో, రాజస్థాన్‌లోని పుష్కర్‌లో కలుస్తుందనే విశ్వాసం ఉంది. ఆ ప్రాంతాల్లో కూడా పుష్కరాలను నిర్వహిస్తున్నారు.


కాళేశ్వరంలో ప్రతిష్ఠాత్మకంగా...

తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం... సరస్వతీ నది పుష్కరాలకు సిద్ధమవుతోంది. గోదావరి, ప్రాణహిత నదులతో సరస్వతి కలిసే త్రివేణీ సంగమంలో పుష్కర స్నానాల కోసం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి 26 వరకు జరిగే పుష్కరాల్లో భాగంగా... శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో నిత్యం వివిధ హోమాలను నిర్వహిస్తారు. అలాగే ప్రధాన ఘాట్‌ వద్ద నదీ హారతి కార్యక్రమం ఉంటుంది. శ్రీ మాధవానంద సరస్వతి, శ్రీ పరిపూర్ణానంద స్వామి, శ్రీ సచ్చిదానంద సరస్వతి, శ్రీ విద్యాశంకర భారతి, ఆచార్య సంవిదానంద సరస్వతి మహరాజ్‌, శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి, శ్రీ యోగానంద సరస్వతి తదితర ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ పుష్కరాలకు హాజరై ప్రార్థనలు చేస్తారు, అనుగ్రహభాషణలు చేసి, భక్తులకు ఆశీస్సులు అందజేస్తారు. పుష్కరాల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడలతో సహా పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ మహా సరస్వతి అమ్మవారి ఆలయం, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంతో పాటు సమీప ఆలయాల సందర్శించుకోవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులు

For National News And Telugu News

Updated Date - May 09 , 2025 | 01:53 AM