Drone Didis Agriculture With Technology: డ్రోన్ దీదీ లు
ABN , Publish Date - Dec 04 , 2025 | 02:24 AM
ఒకప్పుడు ఇంటికే పరిమితమైన గ్రామీణ మహిళలు ఇప్పుడు ఆకాశంలో డ్రోన్లు నడుపుతూ వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఆర్థిక...
ఒకప్పుడు ఇంటికే పరిమితమైన గ్రామీణ మహిళలు ఇప్పుడు ఆకాశంలో డ్రోన్లు నడుపుతూ వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్, దుర్గ్ జిల్లాల్లో కనిపిస్తున్న ఈ మార్పు మహిళా సాధికారతకు అద్దం పడుతోంది.
రాజ్నంద్గావ్ జిల్లా అచ్చోలి గ్రామానికి చెందిన శాంతి విశ్వకర్మ కథ ఎంతో స్ఫూర్తిదాయకం. 15 ఏళ్లుగా స్వయం సహాయక బృందంలో అధ్యక్షురాలిగా ఉన్న ఆమె గతంలో పచ్చళ్లు, అప్పడాలు అమ్ముతూ జీవనం సాగించేవారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకం గురించి తెలుసుకుని గ్వాలియర్లో 15 రోజులపాటు డ్రోన్ పైలట్గా శిక్షణ పొందారు. ఇప్పుడు ఆమె ఆ ప్రాంతంలో ‘డ్రోన్ దీదీ’గా సుపరిచితమయ్యారు. ‘‘గత రెండేళ్లుగా ఈ పని చేస్తున్నాను. రోజూ పది నుంచి 20 ఎకరాలకు మందు పిచికారీ ఆర్డర్లు వస్తుంటాయి. నా యూట్యూబ్ చానల్ కూడా నాకు బాగా సాయపడింది. నా కుటుంబ పూర్తి మద్దతు ఇస్తోంది’’ అని శాంతి ఆనందంగా చెప్పుకొచ్చారు. వరి పొలానికి ఎకరానికి రూ. 300 చొప్పున తీసుకుంటూ చేస్తూ ఆమె ఇప్పుడు ‘లఖ్పతి దీదీ’గా మారారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఆమెకు రూ. 10 లక్షల విలువైన డ్రోన్, రూ. 5 లక్షల విలువైన వాహనం కూడా అందింది. ఈ వాహనంలోనే జిల్లా అంతా తిరుగుతూ రైతులకు సేవలు అందిస్తున్నారు.
టీచర్ కావాలనుకుని..
దుర్గ్ జిల్లాకు చెందిన జాగృతి సాహు ప్రస్థానం మరో అద్భుతం. రెండు పీజీలు, బీఎడ్ పూర్తి చేసి టీచర్ కావాలనుకుని కలలు కన్నారు. కానీ విధి ఆమెను వ్యవసాయ రంగంవైపు నడిపింది. మొదట పుట్టగొడుగుల పెంపకంలో అద్భుత విజయం సాధించి ‘మష్రూమ్ లేడీ’గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత సహజ సిద్ధమైన రంగుల తయారీ చేపట్టి, గతేడాది ఏకంగా రూ. 8.25 లక్షల విలువైన ఉత్పత్తులు విక్రయించారు. ఇప్పుడు ఆమె ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద శిక్షణ పొంది సర్టిఫైడ్ డ్రోన్ పైలట్గా మారారు. టీచర్ కావాలన్న కోరిక నెరవేరకపోయినా డ్రోన్ టెక్నాలజీ, పుట్టగొడుగుల పెంపకం వంటి విషయాల్లో ఎందరో మహిళలకు శిక్షణ ఇస్తూ గురువుగా మారారు.

గ్రామాల్లో కొత్త విప్లవం
శాంతి, జాగృతి వంటి మహిళలు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికను ప్రవేశపెట్టడమే కాకుండా, పాతకాలపు అడ్డంకులను ఛేదిస్తున్నారు. డ్రోన్ల వాడకం వల్ల రైతులకు సమయం, శ్రమ, ఖర్చు ఆదా అవుతున్నాయి. మహిళలను వ్యవసాయ రంగంలో భాగస్వాములను చేయడమే కాకుండా, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోందీ పథకం.
ఇవి కూడా చదవండి
హక్కుల తీర్మానం గురించి అడిగితే.. రేణుకా చౌదరి రియాక్షన్ ఇదే
ఐదెన్ మార్క్రమ్ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో సఫారీల అద్భుత పోరాటం..