Raashi Khanna Opens Up: అలాగైతే పాతబడిపోతాం
ABN , Publish Date - Oct 05 , 2025 | 03:02 AM
దక్షిణాది, హిందీ సినిమాల ద్వారా ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసిన హీరోయిన్ రాశీ ఖన్నా. తాజాగా ఆమె నటించిన ‘తెలుసు కదా’ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమెను ‘నవ్య’ పలకరించింది...
సండే సెలబ్రిటీ
దక్షిణాది, హిందీ సినిమాల ద్వారా ప్రేక్షకులపై తనదైన ముద్ర వేసిన హీరోయిన్ రాశీ ఖన్నా. తాజాగా ఆమె నటించిన ‘తెలుసు కదా’ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమెను ‘నవ్య’ పలకరించింది.
‘తెలుసు కదా’ టీజర్కు మంచి స్పందన వచ్చింది కదా... ఎలా అనిపిస్తోంది?
చాలా ఆనందంగా అనిపిస్తోంది. సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నాం. చాలా కాలం తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది. కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాకు హైదరాబాద్లో ఇల్లు ఉంది. వచ్చిపోతూ ఉంటాను. ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే పుట్టింటికి వచ్చినట్లు అనిపిస్తోంది.
మీరు అనర్గళంగా మంచి తెలుగు మాట్లాడుతున్నారు... ప్రాక్టీస్ చేశారా?
చాలాకాలంగా తెలుగు సినిమాలు చేస్తున్నాను కదా! తెలుగు వచ్చేసింది. నాకు తెలుగే కాదు... తమిళం, హిందీ కూడా బాగా వచ్చు. ప్రేక్షకులతో నేరుగా కనెక్ట్ కావటానికి భాష చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు... ఇది ఆయా భాషల ప్రేక్షకులకు నేను ఇచ్చే కనీసం గౌరవం.
మీరు హిందీ ప్రాజెక్టుల్లో కూడా నటించారు కదా... బాలీవుడ్కు, టాలీవుడ్కు ఉన్న తేడా ఏమిటి?
టాలీవుడ్లో హీరోయిన్లకు చాలా గౌరవం లభిస్తుంది. చాలా ఆదరంగా చూస్తారు. పైగా కాల్షీట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకానే ఉంటుంది. బాలీవుడ్లో కానీ, తమిళ పరిశ్రమలో కానీ కాల్షీట్ పన్నెండు గంటలు ఉంటుంది. అందువల్ల ఎక్కువగా అలసిపోతాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. తెలుగు ప్రేక్షకులకు నా పట్ల అభిమానం ఎక్కువ. నేను ఇతర భాషల్లో చేసిన సినిమాలను కూడా వారు ఆదరిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.
బాలీవుడ్లో దక్షిణాది నటీనటుల పట్ల వివక్ష ఉందని విమర్శలు వినిపిస్తూ ఉంటాయి...
నాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. అంతేకాదు, ఓటీటీ వచ్చిన తరువాత భాషపరమైన సమస్యలు తొలగిపోయాయి. ఇక్కడ హిందీ సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తున్నారు. అక్కడ దక్షిణాది సినిమాలు చూస్తున్నారు. ఓటీటీలు వచ్చిన తర్వాత మంచి నటులకు అన్ని భాషల్లోను అవకాశాలు లభిస్తున్నాయి.

నటనపై మీ అభిప్రాయమేమిటి?
నటనను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. నేను సినిమా రంగానికి వచ్చినప్పుడు నాకు ఏదీ తెలియదు. మనసుకు ఎలా అనిపిస్తే అలా నటించేదాన్ని. ఆ తర్వాత నటనకు కొన్ని టెక్నిక్స్ ఉంటాయని తెలిసింది. పుస్తకాలు చదవటం మొదలుపెట్టా. వీడియోలు చూసేదాన్ని. ముంబాయిలో నాటక రంగంలో పనిచేశా. ఎప్పటికప్పుడు నేర్చుకోపోతే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. మనం పాతపడిపోతాం!
మీరు స్ర్కిప్ట్లు ఎలా ఎంపిక చేసుకుంటారు?
నేను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటా. నా పాత్ర ఎలా ఉందనే విషయంపైనే ఎక్కువ దృష్టి పెడతా! కొన్నిసార్లు డైరక్టర్లు వచ్చి కథలు చెబుతారు. వాళ్ల దగ్గర స్ర్కిప్ట్ ఉండదు. అలాంటప్పుడు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా ప్రాజెక్టులు ఓకే చేస్తా. కొందరు డైరక్టర్లకు మంచి దార్శనికత ఉంటుంది. అలాంటప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. వారు చెప్పినట్లు చేసేస్తాను. కొందరు వచ్చి సలహాలు అడుగుతారు. నాకు తెలిసినంత చెబుతాను.
మీకు ఏ తరహా పాత్రలు చేయాలని ఉంది?
నాకు హారర్ ఫిల్మ్ చేయాలని ఉంది. ఎందుకంటే నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. మైథాలజీ, యాక్షన్ ఫిల్మ్స్ కూడా చేయాలని ఉంది.
మీరు సినిమాలూ చేశారు, వెబ్ సిరీస్లూ చేశారు. రెండింటి మఽధ్యా తేడా ఏమిటి?
కొంత తేడా ఉంది. వెబ్ సిరీస్లలో పాత్రల్లో అనేక కోణాలు ఉంటాయి. వాటిని చూపించటానికి ఎక్కువ సమయం ఉంటుంది. సినిమాల్లో అంత సమయం దొరకదు. అయితే నాకు సినిమాలంటేనే ఇష్టం.
సీవీఎల్ఎన్ ప్రసాద్
నా తల్లితండ్రులు, మా అన్నయ్య, ఇద్దరు స్నేహితులు వీరందరూ నాకు మంచి సపోర్ట్. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్లతో చెబుతా!
నేను భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించను. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. చిన్నప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకొనేదాన్ని. అనుకోకుండా హీరోయిన్ అయ్యా. ఇలా మనం అనుకున్నవన్నీ కావు.
ఒక నటిగా నాకు ఎప్పుడూ అభద్రతా భావం లేదు. నన్ను నేను ఎవ్వరితోను పోల్చుకోను. ప్రతి వ్యక్తికి తనదైన జర్నీ ఉంటుంది.
నాకు ఓషో అన్నా, బ్రహ్మకుమారిల మార్గమన్నా ఇష్టం. ఆధ్యాత్మికతపై నాకు అవగాహన ఉంది. నేను ఈ పరిశ్రమలో నెగ్గుకురావటానికి అది కూడా ఒక కారణం. నేను ఏ పనిచేసినా నిబద్ధతతో చేస్తా. అయితే ఫలితాలు నా చేతిలో ఉండవనే విషయం కూడా నాకు తెలుసు.
ఈ వార్తలు కూడా చదవండి..
Ashok: ప్రతిపక్షనేత సంచలన కామెంట్స్.. సిద్దరామయ్య అవుట్గోయింగ్ సీఎం
PM-SETU Scheme: ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్షాప్లు: పీఎం మోదీ