కంచి పీఠానికి నవ శకం
ABN , Publish Date - May 09 , 2025 | 01:59 AM
మంచిని పెంపొందించడానికి, చెడును తొలగించడానికి అలౌకికమైన ఉపాయాన్ని తెలియజేసేది వేదం. వేదాలు భగవత్ర్పాప్తికి సోపానాలైన కర్మలనే కాకుండా... లౌకిక జీవితానికి తోడ్పడే సదాచారమనే ధర్మాన్ని కూడా...

ఇష్టప్రాప్త్యనిష్ట పరిహారయోః అలౌకికముపాయం యో వేదయతి స వేదః...
మంచిని పెంపొందించడానికి, చెడును తొలగించడానికి అలౌకికమైన ఉపాయాన్ని తెలియజేసేది వేదం. వేదాలు భగవత్ర్పాప్తికి సోపానాలైన కర్మలనే కాకుండా... లౌకిక జీవితానికి తోడ్పడే సదాచారమనే ధర్మాన్ని కూడా బోధిస్తున్నాయి. అసలు వేదమంతా ధర్మాన్ని మాత్రమే ఉపదేశిస్తోందంటూ ‘వేదోఖిలో ఽధర్మమూలమ్’ అని ఋషులు నిర్ణయం చేశారు. అటువంటి వేద జ్ఞానం భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రభావితం చేసింది. ఈ జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసింది. అందుకనే భారతదేశం ‘వేదభూమి’గా, ‘యోగభూమి’గా, ‘కర్మభూమి’గా పిలుపులు అందుకుంటోంది.
మోక్షపురి... కాంచీపురి
ఈ యుగంలో దేశం నలుమూలలకూ సంచారం చేసి తన ఉపదేశాల ద్వారా, రచనల ద్వారా ధర్మాన్ని వ్యాప్తిచేసిన జగద్గురువు ఆది శంకరులు. జగత్తు ఉన్నన్ని రోజులు ఆయన బోధలు వ్యవహారంలో ఉంటాయి. ఆయన అపురూప సృష్ఠి... మఠాల స్థాపన. దక్షిణంలో శృంగేరి శారదాపీఠం, తూర్పున జగన్నాథ పూరీలో గోవర్ధన మఠం, పశ్చిమంలో సముద్ర తీరాన ద్వారకలో కాళికా మఠం, ఉత్తరాన బదరీనాథ్ సమీపాన జ్యోషిమఠ్ ఏర్పాటు చేశారు. ఆది శంకరులు తన అవతార సమాప్తి సమయాన... కాంచీపురంలో కామకోఠి పీఠాన్ని నెలకొల్పి, ఆ క్షేత్రంలోనే శివైక్యం చెందారని తెలుస్తున్నది. కాంచీపురి మోక్షపురిగా వెలసింది. కంచి శివ క్షేత్రమూ, విష్ణు క్షేత్రమూ కూడా. కామాక్షీ విగ్రహం బిందు స్థానంగా అనేక ఇతర దేవాలయాలను కూడా ఆది శంకరులు నిర్మింపజేశారు. ఈ మఠాల నిర్వహణ నియమాలన్నీ శ్రీ శంకరులు చెప్పగా సుధన్వుడు రాసుకొని ‘మహానుశాసనం’ అనే పేరుతో గ్రంఽథం తయారు చేశాడు. ఆసక్తి రేకెత్తించే మరొక అంశం మనకు కాచీపురంలోని వరదరాజస్వామి వారి దేవాలయంలో దర్శనమిస్తోంది. ‘కుడియాంతన్దళం’ అనే గ్రామానికి ‘శంకరాచార్యపురం’, అలాగే ‘సురుట్టిల్’ అని పేర్లు ఉన్నట్టు అక్కడి శాసనాల అధ్యయనం వెల్లడయిన విషయాన్ని 1919లో ప్రచురితమైన ఒక నివేదిక పేర్కొంది. అలాగే క్రీస్తుశకం 1507 నాటి శ్రీవీరనరసింహదేవ కాలానిదైనరాగి రేకులోని వివరాల ప్రకారం... ‘కుడియాంతండలం’ అనే ప్రదేశాన్ని అప్పటి పీఠాధిపతి శ్రీ మహదేవ సరస్వతికి ఆనాటి విజయనగర ప్రభువు బహూకరించినట్టు తెలుస్తున్నది. ఆ గ్రామం... సురుట్టిల్కు పశ్చిమ దిక్కులో ఉంది. ఇంత ప్రాచీనత ఉన్న ఈ మఠ కార్యక్రమాలు ఇప్పుడు మన దేశంలోనే కాదు... అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించాయి. ధార్మిక సేవలు నిర్వహిస్తూ, భక్తులకు మార్గ దర్శనం చేస్తున్నాయి.
సత్యనారాయణ క్షేత్రం నుంచి సత్యవ్రత క్షేత్రానికి
కాగా... ఈ ఏడాది ఏప్రిల్ 30న, శ్రీ ఆది శంకరుల 2534వ జయంతిని పురస్కరించుకొని... దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ్ ద్రావిడ్కు సన్యాస దీక్షను ప్రస్తుత కంచి పీఠాధిపతి అనుగ్రహిస్తున్నట్టు పీఠం శ్రీకార్యం (కార్యనిర్వహణాఽధికారి) గత నెల 25న ప్రకటించారు. వేదాధ్యయనం, శాస్త్ర పరిచయంలో శిష్య స్వామి అసమాన ప్రతిభ గురించి కూడా ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు. దీక్షా ప్రదానం రోజున చేసిన ఏర్పాట్లు అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాయి. దీనికోసం ఎంపిక చేసిన ముహూర్తం అద్వితీయం. గురువు సమక్షంలో... శిష్యస్వామి ఎలాంటి జంకు లేకుండా, పంచభూతాల సాక్షిగా ‘‘ఓం సన్యస్తం మయ’’ అని ప్రకటన చేయగానే... భక్తుల ఆనందాతిశయం మిన్నంటింది. బ్రహ్మచర్యం నుంచి సన్యాస దీక్షకు సిద్ధమైన ఆ బాల ‘పెరియవ’ (స్వామి) వదనంలో శంకరుల దీక్షను దర్శించినవారికి... ఉత్తమానంద స్థితి అక్కడే సిద్ధించింది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి. వరాలకు వ్రతాలకు సంబంధం ఉంది. అన్నవరంలో శ్రీసత్యనారాయణ వ్రతం చేస్తే వరాలు లభిస్తాయని పేర్కొంటూ, సత్యవ్రతం పాటించకపోతే వచ్చే కష్టాల గురించి వ్రత కథ చెబుతోంది. అలాగే ముక్తికి, సత్యవ్రతానికి ఉన్న విడదీయరాని సంబంఽఽధాన్ని ‘ఛాందగ్యోపనిషత్తు’ వివరించింది. కాంచీపురిలో సత్యవ్రతేశ్వరుడి ఆలయం ఉంది. ఆ ఊరికి ‘సత్యవ్రత క్షేత్రం’ అనే పేరు ఉంది. శ్రీ కంచి కామకోటి మఠం బిరుదావళిలో... సత్యవ్రత నామాన్ని ‘కాంచి దివ్య క్షేత్ర’ అని చెప్పడం జరిగింది. మహా సామ్రాజ్యాన్ని ఇచ్చినా కంచి క్షేత్ర వాసులు సత్యాన్ని విడనాడరని నాయనార్లు కీర్తించారు. అన్నవరం సత్యనారాయణ క్షేత్రం నుంచి సత్యవ్రత క్షేత్రమైన కంచికి వచ్చి సన్యాసం స్వీకరించిన శిష్య స్వామి నామం ముందు ‘సత్యం’ అని చేర్చడం ఎంతో సమంజసంగా ఉంది. అంతేకాదు... ‘కచటపాది విధానం’లో ‘సత్య’ అనే పదం 71ని సూచిస్తుంది. శ్రీశిష్య స్వాములు కంచి కామకోటి పీఠాన్ని 71వ అధిపతిగా అధిష్ఠించబోతున్నారు. ‘నడిచే దైవం’గా జగత్ ప్రసిద్ధి చెందిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు... ప్రస్తుత స్వామివారికి ‘శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి’ అని నామకరణం చేశారు. వారి సత్యవ్రతం సర్వజన విదితం. ఆయన నామధేయానికే ‘సత్యం’ అనే విశేషణాన్ని అలంకరించి ‘శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి’గా ... శిష్య స్వామికి ప్రస్తుత పీఠాధిపతి నామకరణం చేయడం ముదావహం.
ఆద్యంతం నేత్రపర్వం
ఈ దీక్షా స్వీకారోత్సవం జరిగిన ప్రదేశ విశిష్టతను క్తుప్తంగా తెలుసుకుందాం. అంబికకు ‘లలితా త్రిశతి’లో ‘కామకోటి నిలయ’ అనే పేరు ఉంది. ఇక్కడ ఆ తల్లి... గురురూపిణి, బ్రహ్మవిద్యా స్వరూపిణి. ఆమె ఆకాశరూపంలో వ్యాప్తి చెంది ఉంది. ఆమె ‘ఈషణాత్రయా’న్ని (ధనేషణ, పుత్రేషణ, లోకేషణ) హరింపజేస్తుంది. శిష్య స్వాములకు అద్వైత ప్రతిపాదకాలైన మహా వాక్యాల ఉపదేశం ఆ దేవాలయంలోని పంచగంగ సరస్సు తీరంలో జరిగింది. కంచి కామకోటి పీఠంలో నాలుగు మహావాక్యాలను బోధించడం ఒక విశిష్టత. గురుశిష్యుల కలయిక సమయంలో... పక్షులు తమ కిలకిలారవంతో... ఆ రూపంలో విహరిస్తున్న దేవతలుగా కనిపించడం అపూర్వ సాక్ష్యం. అలాగే శిష్యుని శిరస్సుపై సాలగ్రామాన్ని గురుస్వామి ఉంచి అభిషేకించినప్పుడు... అన్నవరంలో కుంభవృష్టి కురవడాన్ని యాదృచ్ఛికంగా భావించలేం. శిష్య స్వామి సన్యాస దీక్ష కార్యక్రమం సందర్భంగా... కనీసం 10 వేల మంది ఆ సరస్సు దగ్గర ఆశీనులయ్యారు. కాంచీపుర వీధుల నిండా భక్తజన సందోహం కనిపించింది. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రార్థనలు అందజేసి, ఈ దీక్షా కార్యక్రమం మహత్తును కొనియాడారు. శ్రీ స్వామివారిని గుజరాత్ రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించారు. అనేకమంది ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు... తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి భక్తునిగా రావడం విశేషం. ‘‘బాసర అమ్మవారికి అమూల్యమైన సేవలు అందించిన శిష్య స్వామి... పీఠాన్ని అధిహించడం తెలంగాణ ప్రజలందరికీ సంతోషదాయకం, గర్వకారణం’’ అని తన ఆనందాన్ని వ్యక్తపరచిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్ది ధన్యులు.
లంక వేంకట సుబ్రహ్మణ్యం
పూర్వ శ్రీకార్య నిర్వహణాధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: జమ్ము టార్గెట్గా పాకిస్థాన్ డ్రోన్ దాడులు
For National News And Telugu News