Healthy Recipes: రోగనిరోధక శక్తి పెంచే రుచులివే!
ABN , Publish Date - Jan 25 , 2025 | 03:35 AM
రుతువులు మారే క్రమంలో మన శరీరంపై అనేక రకాల బ్యాక్టీరియాలు దాడి చేస్తూ ఉంటాయి. వీటి దాడులను ఎదుర్కోవటానికి శరీరానికి రోగనిరోధక శక్తి అవసరం. ఈ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో మనం తినే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి కొన్ని వంటలు ఎలా చేయాలో మనం తెలుసుకుందాం.

ఓట్స్ ఫ్రూట్స్ సలాడ్
కావాల్సిన పదార్థాలు:
ఓట్స్- రెండు కప్పులు, దాల్చిన చెక్క పొడి- అర స్పూను, యాపిల్ ముక్కలు- ఒక కప్పు, అరిటిపండు ముక్కలు- ఒక కప్పు, ద్రాక్ష పళ్లు- పది, తేనె- రెండు చెంచాలు, గుమ్మడి గింజలు- చెంచా, నీళ్లు- తగినన్ని.
తయారీ విధానం
ఓట్స్ను ఒక గిన్నెలో తీసుకొని తగినన్ని నీళ్లు పోయాలి. ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నాననివ్వాలి. ఒకవేళ త్వరగా కావాలనుకుంటే మామూలు నీళ్లకు బదులుగా వేడి నీళ్లు పోస్తే... మూడు గంటల్లో నానిపోతాయి.
నానిన ఓట్స్లో ముందుగా యాపిల్ ముక్కలు, అరిటిపండు ముక్కలు, ద్రాక్ష పళ్లు, తేనె, గుమ్మిడి గింజలు కలపాలి.
ఆ మిశ్రమంపై దాల్చిన చెక్క పొడిని చల్లాలి.
జాగ్రత్తలు
ఓట్స్లో నీళ్లకు బదులుగా పాలు కూడా పోయవచ్చు. దీని వల్ల రుచి మారుతుంది.
కొందరు ఈ సలాడ్ను బాగా పలచగా చేస్తారు. అలాంటప్పుడు ఓట్స్లో ఎక్కువ నీళ్లు లేదా పాలు పోయాలి.
గుమ్మిడి గింజలతో పాటుగా పొద్దు తిరుగుడు గింజలు, తులసి గింజలను కూడా కలుపుకోవచ్చు.
అల్లం తులసీ కిచిడీ
కావాల్సిన పదార్థాలు:బాగా కడిగిన తులసి ఆకులు- రెండు చెంచాలు, తురిమిన అల్లం ముక్కలు: అర చెంచా, బియ్యం- ఒక కప్పు, పెసరపప్పు- అర కప్పు, నెయ్యి- నాలుగు చెంచాలు, కరివేపాకు- రెండు చెంచాలు, జీలకర్ర- అర స్పూను, పసుపు- చిటికెడు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని.
తయారీ విధానం
ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు వేసి బాగా కడగాలి. దానిలో నాలుగు కప్పుల నీళ్లు పోయాలి.
తులసి ఆకులు, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
ఒక మూకుడులో నెయ్యిని వేడి చేయాలి. దీనిలో జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
అన్నం, పెసరపప్పు మిశ్రమంలో వేయించిన జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకుతో పాటుగా ఉప్పు వేసి బాగా కలపాలి.
జాగ్రత్తలు
తులసి ఆకులను వేయించకూడదు. అన్నంతో పాటుగా ఉడకనివ్వాలి. దీని వల్ల తులసి
ఆకుల్లోని సారం అన్నంలో కలుస్తుంది.
దీని వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
కిమ్చి స్ర్కాంబుల్డ్ ఎగ్స్
కావాల్సిన పదార్థాలు:
కిమ్చి తయారీకి: సన్నగా తరిగిన క్యాబేజీ- రెండు కప్పులు, ఉప్పు- తగినంత, కారం- చెంచా, వెల్లుల్లి రెబ్బలు- రెండు, అల్లం ముక్కలు- ఒక చెంచా, పంచదార- రెండు చెంచాలు
స్ర్కాంబుల్డ్ ఎగ్స్ తయారీకి: కోడిగుడ్లు- రెండు, పాలు- పావుకప్పు, బ్రెడ్ ముక్కలు- పావు కప్పు, ఉల్లిపాయ ముక్కలు- రెండు స్పూన్లు, ఉప్పు- చిటికెడు, నూనె లేదా నెయ్యి- ఒక చెంచా.
కిమ్చి తయారీ విధానం:
సన్నగా తరిగిన క్యాబేజీలో ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పంచదార వేసి బాగా కలపాలి. దీనిని ఫ్రిజ్లో పెట్టాలి. బాగా ఊరిన తర్వాత బయటకు తీయాలి.
స్ర్కాంబుల్డ్ ఎగ్స్ తయారీ విధానం
ఒక గిన్నెలో గుడ్లలోని సొనను బాగా కలపాలి. దీనిలో పాలు వేసి మళ్లీ కలపాలి. తర్వాత బ్రెడ్, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మిశ్రమంలా చేయాలి.
ఒక మూకుడులో నూనె లేదా నెయ్యిని వేసి వేడి చేయాలి.
దానిలో ఈ మిశ్రమాన్ని వేయాలి. అది వేడికి
దగ్గరపడిన తర్వాత ఒక గరిటెతో చిన్న చిన్న
ముక్కలుగా చేయాలి. దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
ఆ గిన్నెలోనే కిమ్చి వేసి కలపాలి.
జాగ్రత్తలు
సొనలో పాలు పోస్తే అదనపు రుచి వస్తుంది. పాలు వేయక పోయినా పర్వాలేదు.
కిమ్చిలో ఎక్కువ పంచదార వేయకూడదు. దీని వల్ల తీపి పెరిగిపోతుంది.