Share News

Essence of the Bhagad Gita: సమదృష్టి

ABN , Publish Date - Sep 12 , 2025 | 05:43 AM

‘‘జ్ఞానంతో, విజ్ఞానంతో సంతృప్తుడైన (జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా) వ్యక్తి దేనికీ చలించకుండా ఉంటాడు. అతను తన ఇంద్రియాలను జయిస్తాడు. అతనికి మట్టి పెళ్ళ, రాయి, బంగారం అన్నీ ఒకటే. అతడే యోగి’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పాడు...

Essence of the Bhagad Gita: సమదృష్టి

గీతాసారం

‘‘జ్ఞానంతో, విజ్ఞానంతో సంతృప్తుడైన (జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా) వ్యక్తి దేనికీ చలించకుండా ఉంటాడు. అతను తన ఇంద్రియాలను జయిస్తాడు. అతనికి మట్టి పెళ్ళ, రాయి, బంగారం అన్నీ ఒకటే. అతడే యోగి’’ అని ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆయన చెప్పినది అర్థం చేసుకోవడానికి అవగాహన, జిజ్ఞాస, జ్ఞానం, అనుభవం మనకు సాయపడతాయి. ‘జ్ఞానం’ అంటే స్వీయ అవగాహన. దాన్ని సాధించిన వ్యక్తి సంతృప్తిని పొందుతాడు. విజ్ఞానాన్ని ‘శాస్త్రం’ (సైన్స్‌) అని కూడా పిలుస్తారు. విషయాలు, వ్యక్తుల పట్ల ఉత్సుకత అని చెప్పుకోవచ్చు. ఈ ఉత్సుకతలకు సమాధానాలు సేకరించడం అనేది ఎల్లప్పుడూ గతానికి చెందిన జ్ఞానం సంపాదించడం. అది పుస్తకాల్లో లభిస్తుంది. అంతర్గతంగా మనం చేసే ప్రయాణానికి ప్రారంభదశలలో ఈ ఉత్సుకత సాయపడుతుంది. కానీ దానికి పరిమితులు ఉన్నాయి. సైన్స్‌ కూడా కణాలు, తరంగాలకు సంబంధించిన అనిశ్చితమైన సూత్రాలు, ద్వంద్వత్వాల లాంటి పరిమితులతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

మరోవైపు, అస్తిత్వం లేదా ఉనికి... మార్పు లేనిది. అది శాస్త్రీయపరంగా, నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఉత్సుకత సమాధానాల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ అస్తిత్వం అనేది మనలో ప్రతి ఒక్కరికీ కలిగే అనుభవాలతో ప్రతిస్పందిస్తుంది. వాటిని పంచుకోవడానికి మార్గం లేదు. ఒక వ్యక్తి జ్ఞానపరంగా సంతృప్తి చెందాడంటే... అతని అన్ని ప్రశ్నలకూ సమాధానాలు దొరికాయని కాదు. అతనిలో ఉత్సుకత తగ్గిపోయిందని అర్థం. అప్పుడు అతను సాక్షిగా ఉంటాడు. సాక్షిగా ఉండడం అంటే... ఏ అంశం మీదా ఎటువంటి తీర్పులు చెప్పకుండా, అంచనాలు లేకుండా... వస్తువులు, వ్యక్తులు, పరిస్థితుల విషయంలో... ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. ఇది ‘ఎంపికలేని అవగాహన’ స్థితి.


చలించకుండా ఉండడం, ఇంద్రియాలను జయించడం గురించి కృష్ణుడు వివరంగానే చెప్పాడు. మనల్ని ఎవరైనా ప్రశంసించినప్పుడు... దానికి సంపూర్ణంగా అర్హులమని భావిస్తాం. విమర్శలు ఎదురైనప్పుడు కోపగించుకుంటాం. ప్రశంస అనేది తియ్యని విషం అని, ఒక ఉచ్చు అని గ్రహించినట్టయితే... ప్రశంసలను, విమర్శలను అధిగమించే దిశగా మన ప్రయాణాన్ని సులువుగా ప్రారంభించవచ్చు. బంగారాన్ని, మట్టి ముద్దను, రాతి ముక్కను ఒకే విధంగా పరిగణించే దశకు చేరుకోవడం ద్వారా... అన్నిటినీ సమానంగా చూసే స్థితిని సాధించినప్పుడు మనం దేనికీ చలించకుండా ఉంటాం.

కె.శివప్రసాద్‌

ఇవి కూడా చదవండి

జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?

మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

Updated Date - Sep 12 , 2025 | 05:43 AM