అక్షరంతో ఆత్మవిశ్వాసం
ABN , Publish Date - Jun 25 , 2025 | 05:07 AM
జీవితానుభవంలో పండిపోయినా అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నామనే న్యూనతను వయోధికుల్లో తొలగిస్తున్నారు బీనా కలాథియా. కొన్ని వందలమందిని అక్షరాస్యులుగా మార్చిన ఈ...
జీవితానుభవంలో పండిపోయినా అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నామనే న్యూనతను వయోధికుల్లో తొలగిస్తున్నారు బీనా కలాథియా. కొన్ని వందలమందిని అక్షరాస్యులుగా మార్చిన ఈ సూరత్ మహిళ... విద్యతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్నీ నింపుతున్నారు.
మరికాసేపట్లో మధ్యాహ్నం మూడు కాబోతోంది. గుజరాత్లోని సూరత్లో ఉన్న ‘సీనియర్ సిటిజన్ సెంటర్’లో అప్పటికే దాదాపు ఎనభై మంది మహిళలు తమతమ స్థానాల్లో కూర్చొని ఉన్నారు. మరికొందరు ఆ గదిలోకి హడావిడిగా వచ్చి, మిగిలినవారిని పలకరించి కూర్చుంటున్నారు. వారందరూ యాభై నుంచి ఎనభై మధ్య వయసున్నవారే. అప్పటివరకూ వాళ్ళ గుసగుసల్తో హోరెత్తుతున్న గది కాస్తా... 48 ఏళ్ళ బీనా కలాథియా అడుగు పెట్టగానే ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. వారికి ముందురోజు ఇచ్చిన హోమ్ వర్క్ను ఆమె పరిశీలించాక... కొత్త పాఠాలు మొదలయ్యాయి. ‘‘వాళ్ళందరూ చదువులో ఒకే స్థాయిలో లేరు. కొందరు ఇంకా అక్షరాలు నేర్చుకుంటున్నారు. కొందరు పాఠాలు కూడబలుక్కొని చదవగలరు. ఇంకొందరు పుస్తకాలు చక్కగా చదివేస్తారు. కాబట్టి పాఠాలు వారి స్థాయికి అనుగుణంగా ఉంటాయి’’ అని వివరించారు బీనా.

వీధి దీపం కింద...
విలక్షణమైన ఈ బడిని తొమ్మిదేళ్ళ క్రితం వీధి దీపం కింద బీనా ప్రారంభించారు. ఇంతకీ ఆమె ఉపాధ్యాయురాలు కాదు, ఉద్యమకారిణి కూడా కాదు. ‘‘నేను సాధారణమైన గృహిణిని. ఇంటి పనులు, పిల్లల పెంపకంతోనే ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక... తీరిక సమయం ఎక్కువగా దొరికింది. ఇన్నాళ్ళూ నాకోసం గడిపాను. ఇకనైనా సమాజానికి ఏదైనా చేయాలనిపించింది’’ అని గుర్తు చేసుకున్నారు బీనా. అప్పుడు ఆమె దృష్టి తన చుట్టుపక్కల ఉన్న నిరక్షరాస్యులైన వయోధికుల మీద పడింది. ‘‘మన పెద్దలలో చాలామందికి బడికి వెళ్ళే అవకాశం ఎన్నడూ దొరకలేదు. వారి తరువాతి తరాలు బాగా చదువుకొని, తమకు అర్థం కాని భాషల్లో మాట్లాడుతూ ఉంటే వారిలో న్యూనత పెరుగుతోంది. తాము ఎంతో వెనుకబడి ఉన్నామని, తమకు ఏదీ తెలియదనీ వాళ్ళు అనుకుంటున్నారు. అదే వాస్తవమని నమ్ముతున్నారు. తమకూ కాస్త చదువు వచ్చని అనిపించుకోవాలనే తపన వారిలో చూశాను. అందుకే వాళ్ళకు పాఠాలు చెప్పాలనే నిర్ణయం తీసుకున్నాను’’ అంటారు బీనా. అలా ఆసక్తి ఉన్న కొద్దిమందితో బడిని ఆమె ప్రారంభించారు. ‘‘మొదట్లో సాయంత్రం వేళ... వీధి దీపం కింద పేవ్మెంట్ మీద వాళ్ళు కూర్చుంటే... నేను నిలబడి పాఠాలు చెప్పేదాన్ని. తరువాత మా ఇంట్లో ఒక గది కేటాయించాను. ఇంట్లో నా పనులు పూర్తయ్యేసరికి వాళ్ళు వచ్చేవారు’’ అని చెప్పారామె.
వాటికి వెలకట్టలేం
క్రమంగా ఆమె దగ్గరకు చదువుకోసం వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఇప్పటివరకూ కొన్ని వందలమంది అక్షరాస్యులయ్యారు. ప్రస్తుతం 120 మంది బీనా దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు. ‘‘మొదటిసారిగా పెన్సిల్ పట్టుకున్నవారి నుంచి ఎప్పుడో నేర్చుకున్నవి మరచిపోయి... మళ్ళీ నేర్చుకుంటున్నవారు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికీ మొదట్లో కొంత సంకోచం ఉంటుంది. చదువుకు వయసుతో పని లేదనీ, నేర్చుకుంటే సులువేననీ వారిలో నమ్మకాన్ని పెంచడానికి ఓపికగా చెప్పాలి. అక్షరాలు దిద్దడంలో తడబడినవారిలో... అవి పదాలుగా, వాక్యాలుగా మారుతున్నప్పుడు కనిపించే సంతోషానికి, ఆత్మవిశ్వాసానికి వెలకట్టలేం’’ అంటున్నారు బీనా. తనకన్నా పెద్దవారికి బోధించడం మొదట్లో ఇబ్బందిగా అనిపించినా... ఆ తరువాత అలవాటైపోయిందంటారామె. ఆమె ప్రయత్నాన్ని గుర్తించిన అధికారులు... దగ్గర్లోనే ఉన్న ‘సీనియర్ సిటిజన్స్ సెంటర్’లో ఆమె బడి నడపడానికి అనుమతి ఇచ్చారు. రోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటలవరకూ తరగతులు ఉంటాయి. ‘‘దీనికి ప్రభుత్వం నుంచి కానీ, స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ఎలాంటి సాయం ఆమె తీసుకోవడం లేదు. ‘‘పొద్దున్న నా సిస్టర్స్తో కలిసి ‘ముఖ్వాస్’ (డైజెస్టివ్ మౌత్ ఫ్రెషనర్స్) వ్యాపారం చేస్తూ ఉంటాను. దానిలో వచ్చే డబ్బుతో నా విద్యార్థుల చదువుకోసం కావలసినవి కొని ఇస్తూ ఉంటాను’’ అంటున్న బీనా ఎందరో వయోధిక మహిళల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగిస్తున్నారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపి, సమాజంలో గౌరవాన్నీ కల్పిస్తున్నారు.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి