పరోపకారమే లక్ష్యం
ABN , Publish Date - Jun 25 , 2025 | 05:11 AM
మనిషికి మానసిక సంతృప్తి కలగజేయటం కళల ప్రధానోద్దేశం. ఈ కళలు సమాజ హితానికి కూడా పని చేయగలిగితే వాటి ప్రయోజనం మరింత పెరుగుతుంది. ఇలాంటి ఒక ప్రయోగాన్ని చేస్తున్నారు సుష్మా తోట...
స్ఫూర్తి
మనిషికి మానసిక సంతృప్తి కలగజేయటం కళల ప్రధానోద్దేశం. ఈ కళలు సమాజ హితానికి కూడా పని చేయగలిగితే వాటి ప్రయోజనం మరింత పెరుగుతుంది. ఇలాంటి ఒక ప్రయోగాన్ని చేస్తున్నారు సుష్మా తోట. ప్రముఖ కళాకారుడు తోట వైకుంఠం కోడలైన సుష్మ... ఏటా ‘పరోపకార్’ పేరిట ఒక చిత్రకళాప్రదర్శన నిర్వహిస్తారు. దీనిలో పెయింటింగ్లు విక్రయించి వాటిని ‘నచకేత తపోవన్’ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పాఠశాలలకు అందిస్తారు. ఆ విశేషాలను సుష్మ ‘నవ్య’కు వివరించారు.
‘‘నేను ‘నచకేత తపోవన్’ ఫౌండేషన్తో చాలా కాలంగా కలిసి పనిచేస్తున్నా. విద్య, వైద్యం, ఆధ్యాత్మికం- ఈ మూడు ఒక మనిషి జీవితాన్ని సంతృప్తికరంగా ముందుకు నడిపించటంలో కీలక పాత్ర పోషిస్తాయనేది ఫౌండేషన్ భావన. ఈ మూడు ప్రజల ందరికీ ఉచితంగా లభించాలనేది మా లక్ష్యం. అవి సులభంగా, ఎక్కువ ఖర్చు లేకుండా లభించినప్పుడు- జీవితంలో ఎక్కువ ఒత్తిడి ఉండదు. ఒత్తిడి లేనప్పుడు జీవితాన్ని పరిపూర్ణంగా గడపగలుగుతారు. మా లక్ష్యాలలో మొదటిది విద్య కాబట్టి హైదరాబాద్లో, జడ్జెర్లలో రెండు పాఠశాలలను ప్రారంభించాము. వీటిలో ఇప్పటిదాకా సుమారు ఐదు వేల మంది శిక్షణ పొందారు. ప్రస్తుతం 650 మంది చదువుతున్నారు. మా దగ్గర చదివే విద్యార్థులందరికీ ఉచితంగా విద్యను అందిస్తాము. ఉచిత విద్య అంటే చాలా మంది పదో తరగతి వరకు మాత్రమే అనుకుంటారు. మేము పదో తరగతి తర్వాత కూడా సాయం చేస్తాం. మేము చేసిన సాయంతో ఇంజనీర్లు, డాక్టర్లు అయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఉచిత విద్యను అందించటమే కాకుండా- వేసవి కాలంలో సమ్మర్ క్యాంప్లు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఇక్కడ ఒక విషయాన్ని వివరంగా చెప్పాల్సి ఉంది. చాలా సందర్భాలలో ఉచిత విద్య అంటే స్కూల్లో చదివించటమే అనే భావన ఉంది. కానీ ప్రతి రోజు ఉచిత భోజనం, స్కూల్ డ్రస్సులు కాకుండా ప్రతి విద్యార్థిని చదివించటానికి 18 వేల రూపాయల ఖర్చు అవుతుంది. ఉన్నత విద్య చదివించాలంటే ఏడాదికి కనీసం 50 వేల రూపాయల ఖర్చు అవుతుంది.

ఈ కార్యక్రమం వెనుక...
ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతున్నప్పుడు- ఉచిత విద్యా కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహించాలంటే విరాళాలు అవసరమవుతాయి. ఈ విరాళాల కోసం మేము ప్రతి ఏడాది ‘పరోపకార్’ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన చిత్రకారుడు తోట వైకుంఠం మా మామయ్య. నేను ఆ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన అనేకమంది కళాకారులు తెలుసు. వారు వేసే పెయింటింగ్లకు జాతీయంగా, అంతర్జాతీయంగా విపరీతంగా డిమాండ్ ఉంటుంది. అలా డిమాండ్ ఉన్న కొన్ని పెయింటింగ్లతో ఎగ్జిబిషన్ను నిర్వహించి... వాటిని విక్రయించగా వచ్చిన సొమ్మును స్కూలు నిర్వహణకు ఉపయోగించాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటికి దాన్ని ఏడుసార్లు నిర్వహించాం. ప్రతిసారి మాకు చిత్రకళాభిమానుల నుంచి అపూర్వమైన స్పందన లభించింది. సాధారణంగా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని స్కూల్లోనే నిర్వహించేవాళ్లం. కానీ ఈసారి దీన్ని భిన్నంగా నిర్వహించాం. ఎందుకంటే చాలాసార్లు విరాళాలు ఇచ్చిన వారికి తాము ఎలాంటి ప్రభావం చూపిస్తున్నామో తెలిసి ఉండకపోవచ్చు. ఈసారి కేవలం కళాకారులే కాకుండా... కొన్ని గ్యాలరీల వారు కూడా పాల్గొన్నారు. ఈ చిత్రాలను విక్రయించినప్పుడు వచ్చిన మొత్తం సొమ్మును గ్యాలరీల వారు విద్యార్థుల చదువుకు విరాళంగా ఇచ్చారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ప్రతి ఏడాది మేము విరాళాల రూపంలో సేకరించిన సొమ్ములో 90 శాతం ఖర్చు పెట్టేస్తాం. కేవలం 10 శాతం మాత్రమే వచ్చే ఏడాదికి మిగులుతుంది. ఆ ఏడాది విరాళాల రూపంలో వచ్చిన సొమ్ముతో కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ కోణం నుంచి చూసినప్పుడు ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ‘పరోపకార్’ కార్యక్రమానికి చాలా ప్రాధాన్యం ఉంది.
సీవీఎల్ఎన్ ప్రసాద్
ఈసారి ‘పరోపకార్’లో ఇండియా ఫైన్ ఆర్ట్స్ గ్యాలరీకి చెందిన చిత్రాలు, తోట వైకుంఠం, లక్ష్మణ్ ఏలే, బదరీనాథ్, శక్తి వర్మ, లక్ష్మాగౌడ్, సచిన్ జల్దారే, రమేష్ గురజాల, లాలూ ప్రసాద్ షా తదితరుల పెయింటింగ్స్ను ప్రదర్శించారు.
ఇవీ చదవండి:
హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్ తట్టుకోగలదా
మరోసారి మైక్రోసాఫ్ట్లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి