Uttar Pradesh: 10 వేలకు యమహా, 20 వేలకే రాయల్ ఎన్ఫీల్డ్..!
ABN , Publish Date - Jan 02 , 2025 | 08:22 PM
న్యూ ఇయర్ ఆఫర్స్.. 10 వేలకు యమహా, 20 వేలకే రాయల్ ఎన్ఫీల్డ్. ఎంతో విలువైన బైకులను అంత తక్కువ ధరకే ఎలా విక్రయిస్తున్నారని ఆశర్చపోతున్నారా ? అసలు విషయం ఏంటో తెలుస్తే షాక్ అవుతారు..
Uttar Pradesh: న్యూ ఇయర్ ఆఫర్స్..10 వేలకు యమహా, 20 వేలకే విలువైన రాయల్ ఎన్ఫీల్డ్.. అంటూ ఐదుగురు బైక్ లను విక్రయిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇలా అమ్ముతూ వస్తున్నారు. అదేంటి అంత ఖరీదైన బైకులను తక్కువకే అమ్మేస్తున్నారని ఆశర్చపోతున్నారా? అయితే, వారు ఆ వాహనాలను దొంగతనం చేసి ఆఫర్లు అంటూ అమ్మేస్తున్నారు. ఐదుగురు వాహన దొంగలను పోలీసులు అరెస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎంతో విలువైన ఆ బైకులను దొంగిలించి ఆ వాహనాలను ఆఫర్స్ అంటూ విక్రయించేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని కౌశాంబి పోలీస్ స్టేషన్ మాక్స్ హాస్పిటల్ పార్కింగ్ సమీపంలోని సెక్టార్ 1 వైశాలిలో బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తోన్నారు. ఇంతలోనే ఐదుగురు వ్యక్తులు రెండు బైక్లపై వస్తూ కనిపించారు. పోలీసులు వారిని ఆపమని సంకేతాలిచ్చారు. అయితే, బైకులు ఆగిన తర్వాత వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు. అలర్ట్ అయిన పోలీసులు బైక్ పై వెళ్తున్న ఇద్దరినీ పట్టుకున్నారు. విచారణలో ఐదుగురు బైక్ రైడర్లు వాహన దొంగలని తేలింది. వారి పేర్లు ఆసిఫ్, తస్లీమ్, విశాల్, ఖలీల్ అహ్మద్, ఫైజాన్. వారి నుంచి చోరీకి గురైన రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో, యమహా మోటార్సైకిల్ ఢిల్లీలోని శశి గార్డెన్లో దొంగిలించబడిందని, ఇతర మోటార్సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఢిల్లీలోని బద్లీ ఎక్స్టెన్షన్ నుండి దొంగిలించబడిందని పోలీసులకు చెప్పారు. న్యూ ఇయర్ ఆఫర్స్ అని విక్రయించేందుకు ప్లాన్ చేసినట్లు నిందితులు తెలిపారు. అయితే, పార్కింగ్ ప్లేస్ లో కాకుండా అక్కడక్కడ పార్కింగ్ చేసిన వాహనాలనే టార్గెట్గా చేసుకున్నారని.. ఐదుగురు కలిసి వాహనాలను చోరీ చేసేవారని విచారణలో తేలింది. చాలాసార్లు వాహనాలను దొంగిలిస్తూ పట్టుబడి కొట్టించుకున్నట్లు కూడా తెలిసింది. వాహనాన్ని దొంగిలించి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వీలైనంత త్వరగా విక్రయించాలని ప్రయత్నించారు. హడావుడిగా విక్రయించడం వల్ల బైక్లను, రాయల్ ఎన్ఫీల్డ్ను తక్కువ ధరకు విక్రయించేవారు.