Kerala: అమెరికాలో తెలుగు యువకుడి హత్య
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:16 AM
అమెరికాలో ఉన్నత చదువు పూర్తిచేసుకున్న కుమారుడు, త్వరలో మంచి కొలువు సాధించి,
ఫుడ్ డెలివరీ చేసి వస్తుండగా దుండగుల
కాల్పులు.. కారు, డబ్బు ఇవ్వాలంటూ ఘాతుకం
మృతుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసి
తండ్రి క్యాబ్ డ్రైవర్.. భూమినంతా అమ్మేసి
ఇద్దరు పిల్లల్ని అమెరికాకు పంపిన వైనం
నల్లగొండ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉన్నత చదువు పూర్తిచేసుకున్న కుమారుడు, త్వరలో మంచి కొలువు సాధించి, కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు దిగ్ర్భాంతికరమైన వార్త చెవినపడింది! తమ కుమారుడు ఇక లేడని.. దేశం కాని దేశంలో దుండగుడి కాల్పులకు ప్రాణాలొదిలాడని తెలియడంతో కంటికిమంటికీ ధారగా రోదిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన చంద్రమౌళి కుటుంబం నల్లగొండ తిరుమలనగర్ కాలనీలో స్థిరపడింది. ఐదేళ్ల క్రితం చంద్రమౌళి, జీవనోపాధి కోసంతన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వచ్చి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు రవితేజతో పాటు కూతురు ఉంది. రవితేజ(27) హైదరాబాద్లో బీటెక్ చేశాడు. తనకున్న భూమినంతా విక్రయించి కుమారుడిని 2022లో కుమార్తెను 2023లో ఎంఎస్ చదివేందుకు అమెరికా పంపాడు. రవితేజ అక్కడ మాస్టర్స్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.
తాత్కాలికంగా ఓ చైనీస్ రెస్టారెంట్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు ఫుడ్ డెలివరీ చేసేందుకు కారులో ఓ కస్టమర్ ఇంటికి వెళ్లాడు. ఇద్దరు దుండగులు రవితేజపై కాల్పులు జరిపి, ఆయన కారును అపహరించుకుపోయారు. ఇక్కడ తెల్లవారుజామునే లేచి ఉదయం నడకలో ఉన్న రవితేజ తండ్రి చంద్రమౌళికి అమెరికాలోని సమీపబంధువు నుంచి ఫోనొచ్చింది. అమెరికాలో దుండగుల కాల్పులకు రవితేజ చేతులకు బుల్లెట్ గాయాలయ్యాయని, ఏ ప్రమాదం లేదని చెప్పాడు. అయితే, కొద్దిసేపటికే జరిగిన ఘోరం ఆయనకు తెలిసిపోయింది. ‘ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన మా కుమారుడు, విగతజీవిగా వస్తాడని అనుకోలేదు. ఈ విషాదాన్ని మా గుండెలు తట్టుకుంటాయా? మాకు ఇక దిక్కెవరు?’ అంటూ సువర్ణ-చంద్రమౌళి దంపతులు రోదించారు.