Tahawwur Rana: ఎట్టకేలకు అధికారులకు చిక్కిన 26/11 పేలుళ్ల నిందితుడు.. ఇక దబిడి దిబిడే..
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:15 PM
26/11 ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవీర్ రాణాను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చారు. మూడంచెల భద్రతతో అతడ్ని న్యూఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు.

Tahawwur Rana : 17 ఏళ్ల క్రితం అనగా 2008, నవంబర్లో జరిగిన ముంబై ఉగ్ర దాడి నిందితుడు తహవూర్ రాణా(64)ను మొత్తానికి భారత్కు అప్పగించారు. ప్రత్యేక విమానంలో అతడిని అమెరికా నుంచి ఇండియాకు తరలించారు. 26/11 ముంబై ఉగ్ర దాడి నిందితుడైన తహవీర్ రాణా ఇంతకాలం ఇండియాకు చిక్కకుండా శతవిధాల ప్రయత్నించాడు. మొత్తానికి అతని ఆటలు సాగలేదు. తహవూర్ రాణాకు అమెరికాలో ఉండేందుకు ఉన్న చట్టపరమైన అవకాశాలు అన్ని ముగియడంతో.. అతడిని ఇండియాకు అప్పగించేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. దీంతో కరుడుగట్టిన ఉగ్రవాది ఎట్టకేలకు ఇండియాకు చిక్కాడు.
తనను ఇండియాకు అప్పగించవద్దంటూ తహవూర్ రాణా అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన అగ్రరాజ్యం అత్యున్నత న్యాయస్థానం.. తహవూర్ రాణా పిటీషన్ని కొట్టివేసింది. తహవూర్ రాణా అభ్యర్థనను కొట్టి వేస్తున్నట్లు అమెరికా సుప్రీం కోర్టు సోమవారం నాడు వెల్లడించింది. గతంలో ఓ సారి అనగా మార్చిలో కూడా తహవూర్ ఇదే విషమై అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అప్పుడు కూడా న్యాయస్థానం దీన్ని తోసి పుచ్చింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో రాణా అప్పగింతకు లైన్ క్లియర్ అయ్యింది.
తహవూర్ రాణా రాక నేపథ్యంలో అధికారులు.. ఢిల్లీ, ముంబైలోని రెండు జైళ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అతడు కొన్ని వారాల పాటు.. ఎన్ఐఏ కస్టడీలో ఉండనున్నాడు. కొన్ని రోజుల పాటు ఎన్ఐఏ అధికారులు తహవూర్ రాణాని విచారించనున్నారు. కాగా, రాణా అరెస్ట్ గురించి 2020లోనే ఇండియా.. అమెరికాను అభ్యర్థించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రాణా అప్పగింతపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అతడిని భారత్కు అప్పగిస్తామని.. అక్కడే అతడికి శిక్ష విధిస్తారని వెల్లడించాడు. అలానే మరికొందరు నిందితులను కూడా భారత్కు అప్పగిస్తామని ట్రంప్ హామీ ఇచ్చాడు. ఆ మేరకు తాజాగా రాణాను ఇండియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తహవూర్ రాణా విషయానికి వస్తే.. అతడు పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు. లష్కరే ఈ తోయిబాలో చురుగ్గా ఉండేవాడు. ప్రస్తుతం అతడు లాస్ ఏంజిల్స్లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పుతో తహవూర్ రాణాని ఇండియాకు తరలించేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈ క్రమంలో భారత అధికారులు బృందం అమెరికా వెళ్లి.. అవసరమైన పత్రాలు సమర్పించింది. చట్టపరైన ప్రక్రియ ముగియడంతో.. అమెరికా.. తహవూర్ని ఇండియాకు అప్పగించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
Tamil Nadu: ఇంకెన్నాళ్లీ అరాచకం.. స్కూల్లోనే ఇంత దారుణమా
Viral Video: పాపం.. పిల్లిని కాపాడ్డం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు