Student Suicide: విద్యార్థుల ఆత్మహత్యల సర్వేలో పాల్గొనండి
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:12 AM
ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థలను ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఐఐటీ, ఐఐఎంలకు సుప్రీం హెచ్చరిక
న్యూఢిల్లీ, అక్టోబరు 14: ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థలను ఉద్దేశించి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి జరుగుతున్న సర్వేల్లో పాలు పంచుకోవాలని పేర్కొంది. లేకపోతే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించింది. 2018 నుంచి ఇప్పటి వరకు సుమారు 98 మంది విద్యార్థులు ఆయా విద్యాసంస్థల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 39 మంది ఐఐటీలు, 25 మంది ఎన్ఐటీలు, 25 మంది కేంద్ర విశ్వవిద్యాలయాలు, నలుగురు ఐఐఎంలకు చెందిన వారు ఉన్నారు. ఇంత జరుగుతున్నా సదరు విద్యాసంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించడం లేదు. అంతేకాదు.. క్యాంప్సలలో జరుగుతున్న ఈ మరణాలపై కారణాలు వెలికి తీసేందుకు సుప్రీంకోర్టు నియమించిన సంఘానికి కూడా ఆయా విద్యాసంస్థలు సహకరించడం లేదు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని విద్యా సంస్థలకు కేంద్రం మరోసారి సర్క్యులర్లు జారీ చేయాలని పేర్కొంది. అప్పటికీ స్పందించకపోతే.. తామే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించింది.