Supreme Court: పాలమూరు- రంగారెడ్డిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేం
ABN , Publish Date - May 22 , 2025 | 07:41 AM
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతిపై సీబీఐ దర్యాప్తుకు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని చెప్తూ నాగం జనార్దన్రెడ్డి వేసిన ఎస్ఎల్పీను కొట్టివేసింది.
హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అవకతవకల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. ఈ మేరకు మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను కొట్టివేసింది. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నాగం జనార్దన్రెడ్డి 2019 మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. నాగం తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ధర్మాసనానికి తెలిపారు. ఈ వాదనలను మేఘా సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఖండించారు. ఈ అంశంపై దాఖలైన నాలుగు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిందని, ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసిందని వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నాగం జనార్దన్రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది.