Supreme Court Orders CBI Probe: గట్టు వామన్రావు దంపతుల హత్య కేసు సీబీఐకి
ABN , Publish Date - Aug 13 , 2025 | 03:59 AM
తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు- నాగమణిల హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక...
సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పు
ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు అవసరం
నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదు
కొత్తగా అభియోగాలుంటే చేయొచ్చు: ధర్మాసనం
పిటిషనర్ అయిన వామనరావు తండ్రికి రక్షణ కల్పించాలని తెలంగాణా ప్రభుత్వానికి ఆదేశం
న్యూఢిల్లీ, పెద్దపల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు- నాగమణిల హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేసును మరోసారి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. కేసును సమగ్రంగా మళ్లీ దర్యాప్తు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఆదేశించింది. పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద 2021 ఫిబ్రవరి 17న గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి దారుణహత్యకు గురయ్యారు. కారులో వెళుతున్న దంపతులను అడ్డగించిన దుండగులు.. నడిరోడ్డుపైనే అత్యంత కిరాతంగా హతమార్చారు. పోలీసులు దర్యాప్తు చేసి, చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, తన కుమారుడు, కోడలు హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వామనరావు తండ్రి కిషన్ రావు 2021 సెప్టెంబరు 18న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, త్వరగా విచారణ జరిపించి కేసును సీబీఐకి అప్పగించాలని, దోషులకు కఠినంగా శిక్షపడేలా చూడాలని ఆయన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పుట్ట మధుకర్ ప్రమేయంతోనే హత్య జరిగిందని, సీబీఐ విచారణ జరిగితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి సుదీర్ఘకాలం గా వాదనలు వినిపిస్తున్నారు. ఎట్టకేలకు, తెలంగాణలో ప్రభుత్వం మారడంతో విచారణ ను సీబీఐకి అప్పగించడంలో తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే, న్యాయస్థానం ఆదేశిస్తే విచారణకు తాము సిద్ధమేనని సీబీఐ సైతం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ సమర్పిస్తే.. పరిశీలించి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 13న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది.
గత సుప్రీం ఆదేశాలతో.. హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాల ను సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. వామనరావు మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎ్సఎల్కి పంపించామని చెబుతూ ఆ నివేదికను ధర్మాసనం ముందుంచింది. ఆ మరణ వాంగ్మూలం అసలుదేనని ల్యాబ్ నివేదికలో తేలిందనే విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. అయితే, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించినా, లేదంటే.. తమనే మరోసారి సమగ్రంగా దర్యాప్తు చేయమన్నా త మకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికతోపాటు అన్ని రికార్డులను పరిశీలించిన సుప్రీంకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. మరోసారి సమగ్రంగా విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇందులో ఇప్పటికే నిందితులుగా ఉన్న వారిని పోలీసులు అరెస్టు చేశారని, విచారణ తర్వాత బెయిల్పై బయటికి వచ్చారని నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశారని, ఒకసారి ఏదైనా కేసులో చార్జిషీట్ దాఖలు చేస్తే.. ఆ కేసుపై ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం ట్రయల్ కోర్టుకు ఉంటుందని తెలిపారు. చార్జిషీట్ దాఖలు చేశారా? అని ధర్మాసనం ప్రశ్నించగా, అవునని తెలంగాణ ప్రభు త్వం తరఫు న్యాయవాది బదులిచ్చారు. అలాగైతే, గతంలో పోలీసులు అరెస్టు చేసిన నిందితులను మరోసారి అరెస్టు చేయవద్దని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. అయితే.. కొత్తగా అనుమానితులను గుర్తిస్తే, వారినీ నిందితులు గా కేసులో చేర్చితే వారిని అరెస్టు చేయవచ్చని స్పష్టంచేసింది. అలాగే, పిటిషనర్ కు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉం దని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.