వాడే ఇంధనం ఆధారంగా వాహనాలకు స్టిక్కర్లు
ABN , Publish Date - Jan 05 , 2025 | 03:12 AM
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ రాజధానికి ఆవల ఉన్న ప్రాంతాల్లోని వాహనాలకు కూడా రంగుల స్టిక్కర్లు అతికించే విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
న్యూఢిల్లీ, జనవరి 4: కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ రాజధానికి ఆవల ఉన్న ప్రాంతాల్లోని వాహనాలకు కూడా రంగుల స్టిక్కర్లు అతికించే విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వాహనంలో ఉపయోగించే ఇంధనం ఆధారంగా రాజధాని ప్రాంతంలోని వాహనాలకు రంగుల స్టిక్కర్లను అతికించాలని గతంలో ఆదేశించింది. దాని ప్రకారం పెట్రోలు/సీఎన్జీతో నడిచే వాహనాలపై లైట్ బ్లూ కలర్ స్టిక్కర్ను, డీజిల్తో నడిచే వాహనాలకు ఆరెంజ్ స్టిక్కర్ను అతికించాల్సి ఉంటుంది. వాయు నాణ్యత ‘పూర్ క్వాలిటీ’ అని నివేదిక వచ్చిన రోజుల్లో కాలుష్యాన్ని బాగా వెదజల్లే వాహనాలు ఢిల్లీలోకి రాకుండా అడ్డుకునేందుకు ఈ స్టిక్కర్లు ఉపయోగపడతాయి. రాజధానికి చుట్టపక్కల ఉన్న రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలంటూ వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రంగుల స్టిక్కర్లను ఇతర రాష్ట్రాలకు కూడా వర్తింపజేసే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.