Sergio Gore: భారత్లో అమెరికా నూతన రాయబారిగా సెర్జియో గోర్
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:57 AM
అమెరికా అధ్యక్షుడి పాలనా కేంద్రం శ్వేత సౌధం సిబ్బంది వ్యవహారాల డైరెక్టర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత నమ్మకస్తుడు అయిన సెర్జియో గోర్ భారత్లో అమెరికా నూతన రాయబారిగా నియమితులయ్యారు.
ట్రంప్నకు అత్యంత నమ్మకస్తుడు
వాషింగ్టన్, ఆగస్టు 23: అమెరికా అధ్యక్షుడి పాలనా కేంద్రం శ్వేత సౌధం సిబ్బంది వ్యవహారాల డైరెక్టర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత నమ్మకస్తుడు అయిన సెర్జియో గోర్ భారత్లో అమెరికా నూతన రాయబారిగా నియమితులయ్యారు. అమెరికా భారత వస్తువులపై అధిక సుంకాలు విధించినప్పటి నుంచి రెండు దేశాల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. కీలకమైన ఈ పదవికి గోర్(38) నియామకాన్ని ప్రకటిస్తూ అధ్యక్షుడు ట్రంప్.. గోర్ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారిగానూ వ్యవహరిస్తారని ప్రకటించారు.
‘‘ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత గల ప్రాంతంలో నాఎజెండా అమలుకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి అవసరం. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దడంలోనూ గోర్ సహకరించాల్సి ఉంది’’ అని ట్రంప్ అన్నారు. 2024లో ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గోర్ ఆయన రాజకీయ కార్యాచరణ కమిటీలో కీలక పాత్ర పోషించారు.