Defense Minister Rajnath Singh: పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలోనే
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:54 AM
పాకిస్థాన్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే: రాజ్నాథ్ సింగ్
లఖ్నవూ, అక్టోబరు 18: పాకిస్థాన్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ పరిధిలో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. భారత్కు విజయాలు అలవాటుగా మారాయని చెప్పడానికి ఆ ఆపరేషన్ నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్నాథ్తో కలిసి ఆయన సరోజిని నగర్లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ నుంచి తయారైన తొలి బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి శనివారం అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బ్రహ్మోస్ ఓ క్షిపణి మాత్రమే కాదు. మన దేశ వ్యూహాత్మక ధైర్యానికి అదొక ప్రతీక. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగలిగే సామర్థ్యం మన రక్షణ వ్యవస్థకు ఉంది. రక్షణ ఉత్పత్తుల్లో పెరుగుతున్న మన నమ్మకానికి, సామర్థ్యానికి ఇక్కడి బ్రహ్మోస్ ప్రాజెక్టు ఓ ప్రతీక. ఇక్కడి క్షిపణులను తయారు చేయడం ఒకప్పుడు కల. ఇప్పుడు వాస్తవరూపం దాల్చింది’’ అని పేర్కొన్నారు.