Rahul Gandhi: మన విదేశాంగ విధానం కుప్పకూలింది: రాహుల్
ABN , Publish Date - May 24 , 2025 | 05:56 AM
కేంద్ర మంత్రి జైశంకర్ తీరుతో మన విదేశాంగ విధానం కుప్పకూలిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
న్యూఢిల్లీ, మే 23: కేంద్ర మంత్రి జైశంకర్ తీరుతో మన విదేశాంగ విధానం కుప్పకూలిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్కు వ్యతిరేకంగా మహమ్మద్ ఘోరీతో చేతులు కలిపిన రాజపుత్ ఫ్రభువు జైచంద్ పేరు ధ్వనించేలా జైశంకర్ను ‘జై చంద్ జై శంకర్- జేజే’ అని సంబోధిస్తూ ఆయనపై రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘పాకిస్థాన్ చర్యలను ఖండిస్తూ ఎందుకని ఒక్క దేశమూ మన వెనుక నిలబడలేదు?’’ అంటూ నిలదీశారు.
‘‘ఉగ్రవాదంపై పాక్ ప్రకటనను ఎలా విశ్వసించారు? భారత ప్రయోజనాలను ఎందుకని ట్రంప్కు ఫణం పెట్టారు? కెమెరాల ఎదుట మాత్రమే ఎందుకని మీ రక్తం పొంగుతుంది? వట్టి ప్రసంగాలు కట్టిపెట్టి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి’’ అని రాహుల్ డిమాండ్ చేశారు.