Prime Minister Modi: పహల్గాం ఉగ్ర దాడితో దేశ ప్రజల రక్తం మరుగుతోంది
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:20 AM
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ బాధితుల కోసం న్యాయం చేయాలని హామీ ఇచ్చారు. ఆయన ఉగ్రవాదం గురించి తీవ్రంగా మాట్లాడారు, దేశ ప్రజల ఐక్యతే ఈ పోరులో పెద్ద శక్తిగా ఉంది అన్నారు. మరోవైపు, భారత నౌకాదళం యుద్ధ నౌకలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించి, జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులపై చర్యలు కొనసాగిస్తున్నది.

బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచీ నాది
ఉగ్రవాదులకు, కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష
కశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు.. అందుకే ఇంత కుట్ర: మోదీ
యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ‘ఎక్స్’లో నేవీ పోస్ట్
అరేబియా సంద్రంలో నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రదాడి చిత్రాలు చూసి దేశంలోని ప్రతి పౌరుడి రక్తం మరుగుతోందన్న విషయం తనకు అర్థమవుతోందని.. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వారికి న్యాయం చేసే పూచీ తనదని.. పర్యాటకులపై దాడికి పాల్పడ్డవారికి, దాడి వెనుక సూత్రధారులకు అత్యంత కఠిన శిక్ష విధిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ‘మన్ కీ బాత్’ 121వ ఎపిసోడ్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాని.. దేశ ప్రజలందరి హృదయాలనూ ఉగ్రదాడి తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఈ దాడిలో తమవారిని కోల్పోయిన బాధితుల ఆవేదనను.. రాష్ట్రాలకు, భాషలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని, ఈ క్రూర దాడిని ముక్తకంఠంతో నిరసిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘జమ్ముకశ్మీర్లో మళ్లీ శాంతియుత వాతావరణం నెలకొంటోంది. పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. ప్రజాస్వామ్యం బలోపేతమై, పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రజల ఆదాయం పెరుగుతోంది. యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. దేశ శత్రువులు, కశ్మీర్ శత్రువులకు ఇదంతా నచ్చట్లేదు. వారి దీన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. ఉగ్రవాదులు, వారి వెనుక ఉండే సూత్రధారులు కశ్మీర్ మరోసారి నాశనం కావాలనుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద కుట్రకు తెగబడ్డారు.’’ అని ప్రధాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారి పిరికితనానికి ఈ దాడి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
‘‘ఉగ్రవాదంపై మనం జరుపుతున్న పోరులో.. దేశ ప్రజల ఐకమత్యం, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావమే మనకున్న అతి పెద్ద బలం, ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఈ ఐక్యతే ఆధారం’’ అని మోదీ పేర్కొన్నారు. ఈ సమయంలో ఒక దేశంగా మనందరం బలమైన సంకల్పశక్తిని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. ఈ ఉగ్రదాడి తర్వాత.. దేశప్రజలందరూ ముక్తకంఠంతో మాట్లాడడాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోందని చెప్పారు. వివిధ దేశాల నేతలు తనకు ఫోన్ చేసి మాట్లాడారని, లేఖలు రాశారని, సందేశాలు పంపారని.. అందరూ ఈ నీచమైన దాడాని తీవ్రంగా ఖండించారని, బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారని మోదీ వెల్లడించారు.
యుద్ధానికి సిద్ధం.. కాల్పులు.. కూల్చివేతలు..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ‘అణు’బీరాలు పలుకుతున్న వేళ.. భారత నౌకాదళం అరేబియా సంద్రంలో మన యుద్ధనౌకల సన్నద్ధతను మరోసారి పరీక్షించుకుంది. యుద్ధనౌకల నుంచి.. పలు నౌకా విధ్వంసక క్షిపణులను విజయవంతంగా ప్రయోగించింది. సముద్ర జలాల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా దేశ ప్రయోజనాలను కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ నౌకాదళం ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఐక్యతలోనే బలం ఉందని మరో పోస్టులో పేర్కొంది. భారత సైన్యం కూడా.. ‘‘ఎల్లప్పుడూ సిద్ధం, నిరంతరం అప్రమత్తం’’ అంటూ ఒక పోస్టు చేసింది. మరోవైపు.. కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం తనిఖీలు, ఉగ్రవాదుల ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గడిచిన ఆరు రోజుల్లో మన భద్రతా దళాలు 10 మంది ఉగ్రవాదుల ఇళ్లను కూల్చిపారేశాయి. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల నెట్వర్క్ను సమూలంగా నాశనం చేసేందుకే ఈ సోదాలు, కూల్చివేతలను కొనసాగిస్తున్నట్టు పోలీసు శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇక.. నియంత్రణ రేఖ వద్ద పాక్ కవ్వింపు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి మన సైన్యం దీటుగా బదులిస్తోంది.
48 గంటల్లోగా కోతలు పూర్తిచేయండి
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. నియంత్రణ రేఖకు ఆనుకుని ఉన్న పొలాలన్నింటిలో పంట కోతలు 48 గంటల్లోగా (సోమవారం సాయంత్రంలోగా) పూర్తిచేసి, వాటిని ఖాళీ చేయాలని భారత సరిహద్దు భద్రత దళాలు రైతులను శనివారం సాయంత్రం ఆదేశించినట్టు సమాచారం. పంజాబ్ సెక్టార్లో 530 కిలోమీటర్ల మేర విస్తరించిన ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దుపై ఉన్న జీరోలైన్కు, భారత్ వైపు ఉన్న సరిహద్దు కంచెకు నడుమ.. రైతులకు దాదాపు 45 వేల ఎకరాల సాగుభూములున్నాయి. వారంతా అక్కడ గోధుమలు పండిస్తుంటారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయా పొలాల్లో కోతలు రెండు రోజుల్లోగా పూర్తిచేయాలంటూ అమృత్సర్, ఫిరోజ్పూర్, ఫజిల్లా తదితర జిల్లాల్లోని గ్రామ గురుద్వారాలు ప్రకటనలు చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే.. ఆ పొలాలకు వెళ్లేందుకు ఉపయోగించే మార్గాలను (యాక్సెస్ గేట్స్) కూడా త్వరలో మూసేసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నాయి. చొరబాటుదారులకు ఆ పొలాలు మరుగు (కవర్)గా ఉపయోగపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే బీఎ్సఎఫ్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అయితే, అధికారులు ఈ ఆదేశాలను మౌఖికంగా జారీచేశారని పంజాబ్ సరిహద్దు ప్రాంత రైతు సంఘం ఉపాధ్యక్షుడు సూర్జిత్ సింగ్ తెలిపారు. ఇప్పటికే ఆ పొలాల్లో 80-90 శాతం మేర కోతలు పూర్తయ్యాయని, రెండు రోజుల వ్యవధిలో మిగిలిన కోతలు పూర్తిచేసి, పశువులకు అవసరమైన గడ్డి తీసుకెళ్లడం కష్టమేనని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News