Share News

Pahalgam Terror Attack: విమానాశ్రయంలోనే ఉన్నతస్థాయి భేటీ!

ABN , Publish Date - Apr 24 , 2025 | 05:51 AM

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనను రద్దు చేసుకొని ఢిల్లీ చేరుకుని అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మృతులకు సానుభూతి తెలిపి, ఉగ్రవాదులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

Pahalgam Terror Attack: విమానాశ్రయంలోనే ఉన్నతస్థాయి భేటీ!

పహల్గాం దాడిపై ప్రధాని మోదీ సమీక్ష

శ్రీనగర్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ.. విమానాశ్రయంలోనే ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. బుధవారం ఉదయం జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ దోభాల్‌, విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీతో ఎయిర్‌పోర్టులోనే ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన వివరాలను మోదీకి తెలియజేశారు. మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సైతం వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది. బుధవారం ఆయన పహల్గాంలోని బైసారన్‌లో దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ సైనికాధికారులు, జమ్మూకశ్మీరు డీజీపీ నళిన్‌ ప్రభాత్‌,, ఘటన జరిగిన తీరును అమిత్‌ షాకు వివరించారు. ఉగ్రవాదులు ఏ మార్గంలో వచ్చి ఉంటారనే విషయాన్ని కూడా తెలిపారు. అనంతరం ఆయన అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అమిత్‌ షాను చూసి బాధితులు రోదించారు. ఉగ్రదాడిని వివరిస్తూ విలపించారు. వారిని ఓదార్చిన ఆయన, దాడి బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన 26 మంది మృతదేహాలను శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి, పోస్ట్‌మార్టం చేశారు. అనంతరం పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు తరలించారు. అక్కడ అమిత్‌ షా మృతులకు పుష్పాంజలి ఘటించారు. ఆయన వెంట జమ్మూకశ్మీరు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, సీఎం ఒమర్‌ అబ్దుల్లా కూడా ఉన్నారు. జమ్మూకశ్మీరు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపింది.


మరోవైపు జమ్మూకశ్మీరు మొత్తం భద్రతా బలగాలను మోహరించారు. కాగా, పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో బాధితుల కుటుంబ సభ్యులు శ్రీనగర్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో విమాన టికెట్ల ధరలు పెంచొద్దని కేంద్ర పౌర విమానయాన శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది. అలాగే శ్రీనగర్‌ మార్గంలో అదనపు విమానాలను నడపాలని కూడా సూచించింది. మంగళవారం అర్ధరాత్రి సౌదీ అరేబియా నుంచి హుటాహుటిన తిరుగు ప్రయాణమైన ప్రధాని మోదీ విమానం పాక్‌ గగనతలం గుండా ప్రయాణించలేదని అధికారులు తెలిపారు. ఉగ్రదాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆయన విమానం అరేబియా సముద్రం పైనుంచి ప్రయాణించి, గుజరాత్‌ గగనతలం మీదుగా ఢిల్లీ చేరుకున్నట్లు వెల్లడించారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్రంగా ఖండించారు. దాడికి గట్టిగా బదులిస్తామని, ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని ఉగ్రవాదులను హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. బుధవారం ఆయన ఎన్‌ఎ్‌సఏ అజిత్‌ దోభాల్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ, నౌకాదళాధిపతి అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠీతో సమావేశమయ్యారు.


ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ వెలుపల ఢిల్లీ పోలీసు సిబ్బందితో పాటు పారామిలటరీ బలగాలు మోహరించాయి. అక్కడ శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టామని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే భద్రతను పటిష్టం చేశారు.

మరో ఉగ్రదాడి జరిగే అనుమానం!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): దేశంలో మరో ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం నుంచి రాష్ట్రాలకు సందేశాలు అందాయి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, పర్యాటక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈనెల 25, 26 తేదిల్లో భారత్‌ సమ్మిట్‌ పేరిట సదస్సు జరగనున్న క్రమంలో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు మరోసారి సమీక్షించారు. ఈ సదస్సులో 100దేశాల నుంచి సుమారు 450మంది అతిధులు పాల్గొంటున్నారు.


ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషన్‌ వెలుపల ఢిల్లీ పోలీసు సిబ్బందితో పాటు పారామిలటరీ బలగాలు మోహరించాయి. అక్కడ శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టామని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే భద్రతను పటిష్టం చేశారు.

మరో ఉగ్రదాడి జరిగే అనుమానం!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): దేశంలో మరో ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం నుంచి రాష్ట్రాలకు సందేశాలు అందాయి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, పర్యాటక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈనెల 25, 26 తేదిల్లో భారత్‌ సమ్మిట్‌ పేరిట సదస్సు జరగనున్న క్రమంలో భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు మరోసారి సమీక్షించారు. ఈ సదస్సులో 100దేశాల నుంచి సుమారు 450మంది అతిధులు పాల్గొంటున్నారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 05:51 AM