Prayagraj: ప్రయాగ్రాజ్ నో వెహికిల్ జోన్
ABN , Publish Date - Feb 12 , 2025 | 04:46 AM
బుధవారం మాఘ పూర్ణిమను పురస్కరించుకొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాల కోసం భక్తులు భారీ సంఖ్యలో రావొచ్చన్న అంచనాలు, ఇప్పటికే మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోవడం, ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మహాకుంభ్నగర్, ఫిబ్రవరి 11: ప్రయాగ్రాజ్ నగరం మొత్తాన్ని అధికారులు వాహన రహిత ప్రాంతం(నో వెహికిల్ జోన్)గా ప్రకటించారు. బుధవారం మాఘ పూర్ణిమను పురస్కరించుకొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాల కోసం భక్తులు భారీ సంఖ్యలో రావొచ్చన్న అంచనాలు, ఇప్పటికే మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోవడం, ప్రయాగ్రాజ్ వైపు వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం 5గంటల నుంచే నో వెహికిల్ జోన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల కోసం ప్రయాగ్రాజ్ నగరం వెలుపల ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ రూల్స్ నుంచి ఎమర్జెన్సీ, నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లే వాహనాలను మినహాయించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబసమేతంగా మంగళవారం మహాకుంభమేళాలో పాల్గొన్నారు. పుణ్యస్నానం ఆచరించి యాగం నిర్వహించారు. ఇదిలా ఉండగా, మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. అప్పటి నుంచి మాఘ పూర్ణిమ మధ్య కాలంలో భక్తులు త్రివేణి సంగమం ఒడ్డునే ఉంటూ ఉపవాసం చేస్తూ, నిష్ఠతో గడుపుతారు. ఇలా చేయడాన్ని పవిత్రంగా భావిస్తారు. దీన్నే కల్పవాస్ అంటారు. ఈ ఏడాది 10లక్షల మందికి పైగా కల్పవాస్ పాటించారు.