PM Modi: ఢిల్లీలో ఆప్ ఓటమి ఖాయం: మోదీ
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:28 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటమి తప్పదని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే ఆపద (ఆప్) పార్టీ నేతలు పూటకో కొత్త హామీ ఇస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
న్యూఢిల్లీ, జనవరి 22: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటమి తప్పదని ప్రధాని మోదీ చెప్పారు. అందుకే ఆపద (ఆప్) పార్టీ నేతలు పూటకో కొత్త హామీ ఇస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ బీజేపీ కార్యకర్తలతో మోదీ ఆన్లైన్ ద్వారా సంభాషించారు. 50శాతానికిపైగా ఓట్లు పడేలా బీజేపీ నేతలు, బూత్ కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలని ఆయన సూచించారు. నిత్యావసరాలు, కనీస అవసరాలు అందక ఢిల్లీ ప్రజలు కష్టాలు పడుతుంటే కేజ్రీవాల్ శీశ్మహల్ వంటి భవనం కట్టుకున్నారని మోదీ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీని అభివృద్ధి చెందిన రాజధాని నగరంగా తీర్చిదిద్దుతామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లపై చెరి రూ.50 కోట్ల మేర పరువు నష్టం దావా వేయబోతున్నట్లు బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ప్రకటించారు. పంజాబీలు దేశానికి ప్రమాదకరంగా మారారని తాను అన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నందుకే ఈ దావా వేస్తున్నట్లు తెలిపారు.