Operation Sindoor: ‘సిందూర్’లో 13 మంది పాక్ సైనికులు హతం
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:56 AM
ఆపరేషన్ సిందూర్ వల్ల 13 మంది సైనిక అధికారులు సహా మొత్తం 50కిపైగా ప్రాణాలను కోల్పోయినట్టు పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. పాక్ అధికార వర్గాలు శనివారం ఒక ఆంగ్ల టీవీ చానల్ కు ఈ విషయాన్ని నిర్ధారించాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఆపరేషన్ సిందూర్ వల్ల 13 మంది సైనిక అధికారులు సహా మొత్తం 50కిపైగా ప్రాణాలను కోల్పోయినట్టు పాకిస్థాన్ ఎట్టకేలకు అంగీకరించింది. పాక్ అధికార వర్గాలు శనివారం ఒక ఆంగ్ల టీవీ చానల్ కు ఈ విషయాన్ని నిర్ధారించాయి. ఆపరేషన్ సిందూర్ కారణంగా తమకు భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు మూడు నెలల తర్వాత ఇప్పుడు పాకిస్థాన్ అంగీకరించింది. భోలారీ వైమానిక స్థావరంపై భారత దాడిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ మరణించిన విషయాన్ని అతనికి మరణానంతరం ప్రెసిడెన్సీ అవార్డును ప్రదానం చేయడం ద్వారా పాకిస్థాన్ తాజాగా నిర్ధారించింది.
ఆపరేషన్ సిందూర్లో చనిపోయిన మిలిటరీ అధికారులకు పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 14) సందర్భంగా గురువారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్ష భవనంలో అవార్డులను ప్రదానం చేశారు. వీరిలో హవల్దార్ ముహమ్మద్ నవీద్, నాయక్ వకార్ ఖాలిద్, లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్ తదితరులకు మరణానంతరం తంఘా-ఐ-బసలత్ అవార్డులు దక్కాయి. నాయక్ అబ్దుల్ రెహ్మన్, లాన్స్ నాయక్ ఇక్రముల్లా, సిపాయి అదీల్ అక్బర్ తదితరులకు తంఘా-ఐ-జురత్ అవార్డులను అందజేశారు.