Share News

Pakistan Army Chiefs Threat to India: భారత్‌పై అణుబాంబులేస్తాం

ABN , Publish Date - Aug 11 , 2025 | 02:42 AM

భారత్‌పై అణుబాంబులు వేస్తామని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ హెచ్చరించారు. అమెరికా గడ్డపై నుంచి భారత్‌కు హెచ్చరికలు జారీచేశారు. అంతేకాదు.. పాకిస్థాన్‌ ఉనికికే ముప్పు వాటిల్లితే.. సగం ప్రపంచాన్ని తమ వెంట తీసుకెళ్తామంటూ పైశాచికంగా ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ నోరుపారేసుకున్నారు.

Pakistan Army Chiefs Threat to India: భారత్‌పై అణుబాంబులేస్తాం

  • మేం మునిగితే.. సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తాం

  • సింధూనది భారతీయుల ఆస్తి కాదు: పాక్‌ ఆర్మీ చీఫ్‌

  • సింధు నది భారతీయుల ఆస్తి కాదు

  • ఆ నదిపై ఆనకట్ట కడితే క్షిపణులతో పేల్చేస్తాం

  • పాకిస్థాన్‌తో పెట్టుకుంటే భారత్‌కే నష్టం

  • పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ వ్యాఖ్యలు

  • అమెరికా గడ్డ పైనుంచి భారత్‌కు హెచ్చరికలు

వాషింగ్టన్‌, ఆగస్టు 10: భారత్‌పై అణుబాంబులు వేస్తామని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌ హెచ్చరించారు. అమెరికా గడ్డ పైనుంచి భారత్‌కు హెచ్చరికలు జారీచేశారు. అంతేకాదు.. పాకిస్థాన్‌ ఉనికికే ముప్పు వాటిల్లితే.. సగం ప్రపంచాన్ని తమ వెంట తీసుకెళ్తామంటూ పైశాచికంగా మాట్లాడారు. రెండ్రోజుల క్రితం జరిగిన అమెరికా సెంట్రల్‌ కమాండ్‌(సెంట్కామ్‌) మైఖేల్‌ కురిల్లా పదవీ విరమణ, ఆయన స్థానంలో అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మునీర్‌ పాల్గొన్నారు. అనంతరం మిత్రదేశాల రక్షణ శాఖల అధిపతులతో సమావేశమై, చర్చలు జరిపారు. గ్రాండ్‌ హయాత్‌ హోటల్‌లో ప్రవాస పాకిస్థానీలతో భేటీ అయ్యారు. ఆయా సందర్భాల్లో ఆయన భారత్‌ను లక్ష్యంగా చేసుకుని, తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా గడ్డ పైనుంచి ఒక దేశానికి అణు బెదిరింపులు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. భారత్‌ సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై మునీర్‌ తీవ్రంగా మాట్లాడారు.


‘‘సింధూనది భారతీయుల ఆస్తి కాదు. భారత ప్రభుత్వం సింధూ జలాలను ఆపడం వల్ల 25 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుంది. వారు(భారత్‌) ఆనకట్టలు నిర్మిస్తే.. మేం క్షిపణులతో పేల్చేస్తాం. పాకిస్థాన్‌ వద్ద క్షిపణులకు కొదవ లేదు’’ అని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌ ఉనికికి ముప్పు ఏర్పడితే.. భారత్‌పై అణుబాంబులు వేసేందుకు వెనకాడబోమని, తాము మునిగిపోతూ.. సగం ప్రపంచాన్ని తమతో తీసుకెళ్తామని చెప్పారు. నిజానికి ఈ కార్యక్రమాల్లో ఆహూతులు ఫోన్లను వెంట తీసుకెళ్లడానికి అనుమతుల్లేవు. దాంతో.. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఉటంకిస్తూ ‘ద ప్రింట్‌’ ఇచ్చిన కథనంతో మునీర్‌ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. తమతో యుద్ధంలో భారత్‌ ఎంతో నష్టపోయిందని మునీర్‌ ఎద్దేవా చేశారు. ‘స్పోర్ట్స్‌మన్‌ స్పిరిట్‌’తో భారత్‌ తనకు జరిగిన నష్టాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. భారత్‌ను అధునాతన మెర్సిడె్‌సగా పేర్కొంటూ.. ఫెరారీలా హైవేపై దూసుకెళ్తోందన్నారు. అదే సమయంలో.. పాకిస్థాన్‌ను డంప్‌ ట్రక్కుగా పేర్కొంటూ.. రెండూ ఢీకొంటే.. నష్టం ఎవరికో గుర్తించాలన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 07:57 AM