HMPV: రాష్ట్రంలో హెచ్ఎంపీవీ వైరస్ లేదు
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:52 AM
చైనాలో గుర్తించిన కొత్తరకం వైరస్ హెచ్ఎంపీవీకి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాలేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు.

కరోనాకు పాటించిన జాగ్రత్తలు చాలు
లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ కావాలి
వైర్సతో దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి
ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి వెల్లడి
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): చైనాలో గుర్తించిన కొత్తరకం వైరస్ హెచ్ఎంపీవీకి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాలేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు. ఈ వైరస్ గురించి భయాందోళనలు అవసరం లేదన్నారు. ‘న్యూమో విరిలే’ కుటుంబానికి చెందిన కొత్త రకం వైరస్ కరోనా తరహాలోనే ఒకరి నుంచి మరోకరికి సంక్రమిస్తుందని చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. వైరస్ సోకినవారి దగ్గు, తుమ్ముల వల్ల వెలువడే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తక్కువ స్థాయిలోనే ఉందని, మన దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.