Reinstated Gold Foils: శబరిమల ఆలయానికి కొత్త ప్రధాన అర్చకుడు
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:01 AM
శబరిమల వార్షిక తీర్థయాత్ర కొన్ని వారాల్లో మొదలవుతున్న వేళ, అయ్యప్ప స్వామి ఆలయ కొత్త మేల్శాంతిగా (ప్రధాన అర్చకుడిగా) ప్రసాద్ ఈ.డీ శనివారం నియమితులయ్యారు.
బంగారు తాపడాలను తిరిగి అమర్చిన దేవస్థానం బోర్డు
శబరిమల, అక్టోబరు 18: శబరిమల వార్షిక తీర్థయాత్ర కొన్ని వారాల్లో మొదలవుతున్న వేళ, అయ్యప్ప స్వామి ఆలయ కొత్త మేల్శాంతిగా (ప్రధాన అర్చకుడిగా) ప్రసాద్ ఈ.డీ శనివారం నియమితులయ్యారు. కొల్లం జిల్లా మయ్యనాడుకు చెందిన మనూ నంబుతూరి ఎం.జీ.. అయ్యప్ప దేవాలయానికి 100 మీటర్ల దూరంలో ఉన్న మలికప్పురం ఆలయానికి మేల్శాంతిగా ఎంపికయ్యారు. నెలవారీ పూజల కోసం శుక్రవారం శబరిమల ఆలయం తెరుచుకోగా, ఉషాపూజ అనంతరం ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డు ఆధ్వర్యంలో సంప్రదాయ లాటరీ పద్ధతి ద్వారా ఈ ఎంపిక జరిగింది. ఇక, శబరిమల గర్భగుడి ముందున్న ద్వారపాలకుల విగ్రహాలపై ఉన్న బంగారు తాపడాలను దేవస్థానం బోర్డు తిరిగి అమర్చింది. బంగారు పూత పూసిన రాగి తాపడాలను మరమ్మతుల కోసం 2019లో తొలగించగా.. పలకల్లో తూకం లోపం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో కేరళ హైకోర్టు విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.