Madras High Court: ఆలయాల నిధులు దేవుళ్లకు మాత్రమే..
ABN , Publish Date - Aug 31 , 2025 | 05:16 AM
భక్తులు విరాళంగా ఇచ్చిన నిధులు దేవుడికి మాత్రమే చెందుతాయని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇతర కార్యక్రమాలకు ఆ నిధులను మళ్లించకూడదని తేల్చి చెప్పింది.
ఇతర కార్యక్రమాలకు మళ్లించరాదు
మతపరమైన విధులకే వినియోగించాలి
మద్రాస్ హైకోర్టు స్పష్టీకరణ
చెన్నై, ఆగస్టు 30: భక్తులు విరాళంగా ఇచ్చిన నిధులు దేవుడికి మాత్రమే చెందుతాయని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇతర కార్యక్రమాలకు ఆ నిధులను మళ్లించకూడదని తేల్చి చెప్పింది. ఆ నిధులను మతపరమైన, దాతృత్వ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని పేర్కొంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు ఇచ్చింది. ఆలయాల నిధులతో కల్యాణ మండపాలు నిర్మించడానికి 2023-25 మధ్య తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఐదు జీవోలను జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియమ్, జస్టిస్ జీ అరుల్ మురుగన్లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
ఆలయాల నిర్వహణ, అభివృద్ధికి మాత్రమే ఆలయాల నిధులు వినియోగించాలని, కల్యాణ మండపాలు వంటి వాణిజ్య అవసరాలకు వాటిని మళ్లించకూడదని చెప్పింది. హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్- 1959 ప్రకారం పూజలు, అన్నదానం, యాత్రికుల సంక్షేమం, పేదలకు సహాయం వంటి కార్యక్రమాలకు తప్ప, ఆదాయార్జన కార్యక్రమాలకు నిధులను మళ్లించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.