Madhya Pradesh: జబల్పూర్ భూగర్బంలో బంగారు కొండ!
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:48 AM
మధ్యప్రదేశ్ రాష్ట్రం దశ తిరిగింది. ఆ రాష్ట్రంపై కనక వర్షం కురవనుంది. ఇనుప ఖనిజానికి నెలవైన ఆ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎ్సఐ)కు చెందిన జియాలజిస్టులు బంగారం నిక్షేపాలను గుర్తించారు.
100 హెక్టార్లలో లక్షల టన్నుల పసిడి నిల్వలు
మధ్యప్రదేశ్లో గుర్తించిన జీఎ్సఐ శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, ఆగస్టు 8: మధ్యప్రదేశ్ రాష్ట్రం దశ తిరిగింది. ఆ రాష్ట్రంపై కనక వర్షం కురవనుంది. ఇనుప ఖనిజానికి నెలవైన ఆ రాష్ట్రంలోని జబల్పూర్ జిల్లాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎ్సఐ)కు చెందిన జియాలజిస్టులు బంగారం నిక్షేపాలను గుర్తించారు. గ్రాములు, కిలోల్లో కాదు.. టన్నుల కొద్దీ బంగారం నిల్వలను కనుగొన్నారు. జబల్పూర్ జిల్లాలోని మహాగ్వాన్ కియోలరి ప్రాంతంలో ఏకంగా 100 హెక్టార్ల భూముల్లో లక్షల టన్నుల పసిడి నిల్వలు ఉన్నట్టు కనిపెట్టారు. ఖనిజ నిక్షేపాల కోసం ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో భాగంగా చేసిన మట్టి నమూనా పరీక్షలు, రసాయన విశ్లేషణల ద్వారా పసిడి నిల్వలపై స్పష్టమైన అంచనాకు వచ్చామని జీఎ్సఐ శాస్త్రవేత్త ఒకరు జాతీయ మీడియాకు చెప్పారు.
ఆ భూముల్లో బంగారంతోపాటు రాగి, మరిన్ని విలువైన లోహాలు కూడా ఉన్నాయని చెప్పారు. మహాగ్వాన్ కియోలరి ప్రాంతంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇనుము, మాంగనీసు నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి వెలికితీసిన ఇనుము, మాంగనీసు, లాటిరైట్, సున్నపురాయితోపాటు సిలికా తదితర ఖనిజాలు చైనా సహా అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అదే ప్రాంతంలో ఇప్పుడు బంగారం నిల్వలు ఉన్నాయని తేలడంతో రాబోయే సంవత్సరాల్లో మధ్యప్రదేశ్ దశ తిరగబోతుంది. మైనింగ్ రంగంలో దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా రికార్డులకెక్కనుంది. మధ్యప్రదేశ్లో బంగారం నిక్షేపాలు బయటపడడం ఇదేం తొలిసారి కాదు. ఆ రాష్ట్రంలోని కత్నీ జిల్లాలో కొన్నేళ్ల క్రితం భారీ స్థాయిలో బంగారు నిక్షేపాలను గుర్తించారు.