Kejriwal: అద్దెకు ఉండే వారికి ఉచిత విద్యుత్తు, నీరు
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:37 AM
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రజలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరాల జల్లు కురిపిస్తోంది.
మళ్లీ అధికారంలోకి రాగానే అమలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ, జనవరి 18: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రజలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరాల జల్లు కురిపిస్తోంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే అద్దె ఇళ్లలో ఉండే వారికి ఉచిత కరెంట్, నీరు అందజేస్తామని ఆ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రకటించారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఎక్కడికి వెళ్లినా అద్దెకుండే ప్రజలు కలుస్తున్నారని.. తమకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాలలు, ఆస్పత్రుల నుంచి ప్రయోజనాలను పొందుతున్నా ఉచిత కరెంట్, నీరు పొందలేకపోతున్నామని చెబుతున్నారన్నారు. అందుకే వారి సమస్యను పరిష్కరించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీలో అద్దెకుంటున్న వారిలో ఎక్కువ మంది పూర్వాంచలీలేనని.. వారంతా పేదలేనని చెప్పారు. అందుకే వారి కోసం ఎన్నికల అయిపోగానే కొత్త పథకాలు తెచ్చి ఉచిత విద్యుత్తు, నీరు అందజేస్తామన్నారు. ఇదిలా ఉండగా, న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఇంటింటి పర్యటన సందర్భంగా కేజ్రీవాల్ కారులో వెళ్తుండగా ఆయన కాన్వాయ్పై కొందరు రాళ్లు విసిరారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఆప్.. ఇది బీజేపీ కుట్రేనంటూ ఆరోపించింది. ‘బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. ఆ పార్టీ గూండాలు కేజ్రీవాల్ ప్రచారాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని గాయపరిచేందుకు రాళ్లతో దాడి చేశారు. కేజ్రీవాల్ మీ పిరికిపందల దాడికి భయపడడు’ అని విమర్శించింది.