Indigo Flight: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
ABN , Publish Date - Jan 05 , 2025 | 02:20 AM
ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
శంషాబాద్ రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ముంబై ఎయిర్పోర్టు నుంచి 144 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇండిగో విమానం ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, పైలట్లు శంషాబాద్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఇతర విమానాలకు ల్యాండింగ్, టేకా్ఫను నిలిపివేసి ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతిచ్చారు. ఈ విమానం రాత్రి 8 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంజనీర్లు, సమస్యను పరిష్కరించడంతో శుక్రవారం రాత్రి 10.47 గంటలకు విమానం విశాఖపట్నం వెళ్లింది.