India vs Pakistan Missile Power: భారత్తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..
ABN , Publish Date - May 05 , 2025 | 06:28 PM
ఇటీవల అబ్దాలీ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించిన పాక్ తాము భారత్కు ఏరకంగానూ తీసిపోమని చెప్పే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో భారత్, పాక్ క్షిపణి సామర్థ్యం ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఉగ్రమూకలను భారత్పై ఉసిగొల్పి అమాయకులను పొట్టన పెట్టుకున్న పాక్.. క్షిపణి ప్రయోగాలు చేస్తూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. తాజాగా అబ్దాలీ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది. సాయుధ దళాల యుద్ధ సన్నద్ధతను పరిశీలించే నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించినట్టు చెప్పుకొచ్చింది. భారత్ను టార్గెట్ చేసుకునే సత్తా తమకుందని చెప్పుకుంది. మరి ఈ నేపథ్యంలో భారత్, పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం.
పాక్ ప్రయోగించిన అబ్దాలీ క్షిపణిని హత్ఫ్-2 అని కూడా పిలుస్తారు. దీన్ని పాక్కు చెందిన స్పేస్ రీసెర్చ్ కమిషన్ రూపొందించింది. భూమిపై నుంచి ప్రయోగించే ఈ బాలిస్టిక్ క్షిపణి 450 కిలోమీటర్ల దూరంలోని ఉపరితల లక్ష్యాలను ఛేదించేలా రూపొందించారు. ఇందులో అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ అణువార్ హెడ్స్ మోసుకెళ్లే సామర్థ్యం మాత్రం లేదు. ఇక దాయాది దేశం వద్ద బాబర్ (700 కిలోమీటర్లు), ఘజ్నవీ(300 కిలోమీర్లు), షాహీన్ (2750కిమీటర్లు) మిసైళ్లు కూడా ఉన్నాయి.
ఇక భారత్ ఇప్పటికే వివిధ లక్ష్యాలను ఛేదించగలిగేలా పలు రకాల క్షిపణులను తయారు చేసుకుంది. బ్రహోస్, అగ్నీ-5, నిర్భయ్, ప్రళయ్, పృథ్వి-2 మిస్సైల్స్ భారత అమ్ములపొదిలో రెడీగా ఉన్నాయి.
అగ్నీ-5 మిస్సైల్.. గరిష్ఠంగా 8 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగలదు. టన్ను బరువున్న వార్హెడ్లను దీని ద్వారా ప్రయోగించొచ్చు. భారత్ వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణిగా పేరుపొందింది. ఇక సబ్మెరైన్ ద్వారా ప్రయోగించగలిగే కే-4 ఎస్ఎల్బీఎమ్ 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులువుగా ఛేదించగలదు. కే-4తో అణుబాంబులు కూడా ప్రయోగించొచ్చు. పాక్ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయగలిగేలా దీన్ని రూపొందించారు.
సూపర్ సానిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ధ్వనికి మూడు రెట్లు సమానమైన వేగంతో( మాక్-3) ప్రయాణిస్తూ శత్రుదేశ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలిగే నిర్భయ్కు శత్రుదేశ రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా మార్గమధ్యంలో తన దిశను మార్చుకుని ప్రయాణించే సామర్థ్యం ఉంది. ఉపరితల లక్ష్యాలను ఛేదించేందుకు ఉద్దేశించిన టాక్టికల్ మిసల్ ప్రళయ్ పరిధి 150 కిలోమీటర్లు. ఇది శత్రుదేశ నిర్మాణాలను అత్యంత ఖచ్చితత్వంతో కూల్చగలదు.
ఇక వైమానికశక్తిలో కూడా భారత్ ముందు పాక్ దిగదుడుపే. భారత ఎయిర్ఫోర్స్ విమానాల సంఖ్య 2229 కాగా వీటిల్లో యుద్ధ విమానాల సంఖ్య 513. పాక్ యుద్ధ విమానాల సంఖ్య 328. భారత్ వద్ద రఫేల్, సుఖోయ్, మిగ్ విమానాలు ఉంటే పాక్ వద్ద జే-17, ఎఫ్-16 యుద్ధ విమానాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీ రోడ్డు ప్రమాదం.. ఇండియన్ ఐడల్ విన్నర్కు తీవ్ర గాయాలు
అత్యాధునిక రష్యా క్షిపణులను దిగుమతి చేసుకున్న భారత ఆర్మీ
పాక్ మహిళ సీమా హైదర్ ఇంట్లోకి చొరబడ్డ అగంతుకుడు..
For National News And Telugu News