PM Modi: స్వదేశీ ఆయుధాలతో సత్తా చాటాం
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:37 AM
మన దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలతో ఆపరేషన్ సిందూర్లో సత్తా చాటామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాలానుగుణంగా యుద్ధతంత్రాలు మారుతూ వస్తున్నాయని..
కేంద్ర మంత్రివర్గ భేటీలో ప్రధాని మోదీ వెల్లడి
సిందూర్పై రక్షణ శాఖ ప్రజెంటేషన్
న్యూఢిల్లీ, జూన్ 4: మన దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలతో ఆపరేషన్ సిందూర్లో సత్తా చాటామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాలానుగుణంగా యుద్ధతంత్రాలు మారుతూ వస్తున్నాయని.. ఇక ముందు భారత్లో ‘మేకిన్ ఇండియా’ ఆయుధాలు, వ్యవస్థలకే ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో మూడున్నర గంటల పాటు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత మంత్రులతో భేటీ ఇదే తొలిసారి కూడా. పాకిస్థాన్తో ఉద్రిక్తతల సమయంలో భారత్ చూపిస సత్తాపై ఈ భేటీలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం.
మన రక్షణ శాఖ చెప్పినదానికంటే ఎక్కువగా నష్టం జరిగినట్టుగా పాకిస్థాన్ స్వయంగా బయటపెట్టిన అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించినట్టు తెలిసింది. ఇక ప్రధాని మోదీ నేతృత్వంలో మూడోసారి సర్కారు ఏర్పాటై ఈ నెల 9వ తేదీకి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో.. వివిధ మంత్రిత్వ శాఖలు సాధించిన విజయాలపై మరో ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టు సమాచారం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ, జలశక్తి శాఖ విజన్ 2047 ప్రణాళికలను వివరించినట్టు తెలిసింది. మరోవైపు దేశంలో ఏటేటా పెరిగిపోతున్న ఊబకాయం సమస్య, ఆరోగ్యకర జీవన శైలిని అనుసరించాల్సిన అవసరంపై ఆరోగ్య శాఖ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం.