Deepfake with AI: డీప్ఫేక్లపై కేంద్రం కొరడా
ABN , Publish Date - Oct 23 , 2025 | 04:26 AM
కృత్రిమమేధ (ఏఐ) సహాయంతో తప్పుడు సమాచారాన్ని, డీప్ఫేక్ ఆడియో, వీడియోలను రూపొందించి జనాల్ని మోసగిస్తున్న....
ఏఐ ద్వారా సృష్టించే కంటెంట్ మీద ‘ఇది కృత్రిమం’ అనే లేబుల్ తప్పనిసరి
వీడియోకైతే తెర మీద 10శాతం మేర..
ఆడియోకు తొలి 10 శాతం వ్యవధిలో..
కృత్రిమ కంటెంట్ అప్లోడ్ చేసే వారి నుంచి అంగీకార పత్రం
ఐటీ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ఐటీ శాఖ ముసాయిదా పత్రం
న్యూఢిల్లీ, అక్టోబరు 22: కృత్రిమమేధ (ఏఐ) సహాయంతో తప్పుడు సమాచారాన్ని, డీప్ఫేక్ ఆడియో, వీడియోలను రూపొందించి జనాల్ని మోసగిస్తున్న ఘటనలు పెరిగిపోతున్న దృష్ట్యా.. వాటి కట్టడికి కేంద్రం నడుంబిగించింది. ఈ మేరకు ఐటీ నిబంధనల చట్టం, 2021కి సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ఐటీ శాఖ బుధవారం ముసాయిదాను విడుదల చేసింది. ఏఐ ద్వారా సృష్టిస్తున్న డీప్ఫేక్ వంటివి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజలను మోసగిస్తున్నాయని, వ్యక్తులను అప్రతిష్ఠపాలు చేస్తున్నాయని, ఆర్థిక మోసాలకు కారణమవుతున్నాయని, ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తున్నాయని ఐటీ శాఖ ఈ సందర్భంగా వెల్లడించింది. దీనిని నివారించటం కోసం ముసాయిదా ప్రతిపాదనలు తయారుచేశామని తెలిపింది. కనీసం 50లక్షల ఖాతాదారులున్న సోషల్ మీడియా సంస్థలు, ఇతర ప్లాట్ఫామ్స్కు ఈ నియంత్రణలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం.. నిజమైన సమాచారంలాగే భ్రమింపజేసేలా అల్గారిథమ్ ఆధారంగా, కంప్యూటర్ ద్వారా తయారుచేసే కంటెంట్ను ‘సింథటికల్లీ జెనరేటెడ్ కంటెంట్’ (కృత్రిమంగా సృష్టించిన అంశాలు)గా పిలుస్తారు. ఈ తరహా కంటెంట్ను అప్లోడ్ చేసే వ్యక్తుల నుంచి ఇది కృత్రిమ కంటెంట్ అనే అంగీకారపత్రాన్ని సోషల్ మీడియా సంస్థలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫేక్ ఆడియో, వీడియో సమాచారాన్ని వినియోగదారులు గుర్తించి జాగ్రత్తపడేలా.. వాటి మీద ‘ఇది కృత్రిమ కంటెంట్’ అనే హెచ్చరిక కనిపించాలి/వినిపించాలి. వీడియోకైతే.. అది కనిపించే తెర మీద 10 శాతం స్థలంలో ఈ హెచ్చరిక ఉండాలి. ఆడియో అయితే మొత్తం వ్యవధిలో తొలి 10 శాతం వ్యవధి మేర హెచ్చరిక వినిపిస్తూ ఉండాలి. కృత్రిమ కంటెంట్ను గుర్తించి, దానిపై నిర్దేశితస్థాయిలో హెచ్చరిక లేబుల్ ఉండేలా సోషల్ మీడియా సంస్థలు సాంకేతికపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ ముసాయిదా ప్రతిపాదనలపై అభిప్రాయాల్ని, సూచనల్ని నవంబరు 6వ తేదీ వరకూ తమకు పంపించవచ్చని ఐటీ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. కాగా, సైబర్మోసాల నుంచి వినియోగదారుల్ని రక్షించటానికి కొత్త యాంటీ స్కామ్ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు మెటా ప్రకటించింది.