Family Tragedy: కొడుకును చంపి.. ఇంకుడు గుంతలో పాతిపెట్టాడు!
ABN , Publish Date - Aug 14 , 2025 | 03:45 AM
వ్యసనాలకు బానిసైన కొడుకును తండ్రి తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు కొడుకు మృతిచెందాడు. తండ్రి ఆ మృతదేహాన్ని ఇంటి వెనుక ఇంకుడు గుంతలో పాతిపెట్టాడు.
రెండేళ్ల క్రితం జరిగిన ఘటన తండ్రి మృతిచెందడంతో వెలుగులోకి
బెంగళూరు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): వ్యసనాలకు బానిసైన కొడుకును తండ్రి తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు కొడుకు మృతిచెందాడు. తండ్రి ఆ మృతదేహాన్ని ఇంటి వెనుక ఇంకుడు గుంతలో పాతిపెట్టాడు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తండ్రి మృతితో వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బసవనహళ్లికి చెందిన గంగాధర్(55)కు రాఘవేంద్ర(32), రూపేశ్ ఇద్దరు కుమారులు. రూపేశ్ ఇంటికి దూరంగా వేరే చోట ఉద్యోగం చేస్తున్నాడు. రాఘవేంద్ర(32) వ్యసనాలకు బానిసయ్యాడు. నెలల తరబడి ఇంటికి వచ్చేవాడు కాదు. డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. ఇలా రెండేళ్లక్రితం డబ్బులు అడిగిన సమయంలో తండ్రి తీవ్రంగా కొట్టడంతో రాఘవేంద్ర మృతి చెందాడు.
ఈ విషయం బయటకు పొక్కనివ్వకుండా, 2రోజులపాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచాడు. మూడో రోజు చిన్నకొడుకు రూపేశ్ వచ్చాక, అతన్ని బెదిరించి ఇంటి వెనుక భాగాన ఇంకుడుగుంతలో రాఘవేంద్ర మృతదేహాన్ని పాతిపెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 2న గంగాధర్ అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియలకు కొడుకులిద్దరూ లేకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూపేశ్ను పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.