Supreme Court: తమిళనాట సర్ పనులు ఆపకుంటే ఈసీపై సుప్రీం కోర్టులో పిటిషన్
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:46 AM
తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఆపకపోతే సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేయాలని డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది.
చెన్నై, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఆపకపోతే సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేయాలని డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. ఈ నెల నాలుగు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు సహా 12 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపట్టనున్న నేపథ్యంలో స్థానిక టి.నగర్లో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. డీఎంకే మిత్రపక్షాలతో సహా 46 తమిళ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, బీజేపీ ప్రతినిధులను ఆహ్వానించలేదు. విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగంను ఆహ్వానించినా ఆ పార్టీ తరఫున ప్రతినిధులెవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదు. పీఎంకే, డీఎండీకే పార్టీలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పాలకులకు సానుకూలంగా ఈసీ సర్ పేరుతో ఓట్ల చోరీలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.