VK Saxena : మరణాలపై ఢిల్లీ ఎల్జీ మాట మార్పు
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:42 AM
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనలో మరణాలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అరగంట వ్యవధిలోనే మాట మార్చారు. తొక్కిసలాటలో పలువురు చనిపోయారంటూ తొలుత మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు. అరగంట తర్వాత

తొలుత మృతులకు సంతాపం.. ఎక్స్లో పోస్టు
తర్వాత మరణాల ప్రస్తావన తొలగిస్తూ ఎడిట్
మరణాలను దాచాలనుకున్నారని విమర్శలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనలో మరణాలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అరగంట వ్యవధిలోనే మాట మార్చారు. తొక్కిసలాటలో పలువురు చనిపోయారంటూ తొలుత మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటిస్తూ ఎక్స్లో పోస్టు పెట్టారు. అరగంట తర్వాత ఆ పోస్టును ఎడిట్ చేశారు. మరణాల ప్రస్తావనను తొలగించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంపై స్పందిస్తూ సక్సేనా తొలుత రాత్రి 11.55 నిమిషాలకు ఎక్స్లో పోస్టు పెట్టారు. ‘‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయపడ్డారు. ఇది చాలా బాధాకరం’’ అని పేర్కొన్నారు. 12.24 గంటలకు ఆ పోస్టును ఆయన ఎడిట్ చేస్తూ.. మరణాల ప్రస్తావనను తొలగించి ‘తొక్కిసలాట ఘటన దురదృష్టకరం’ అని మార్చారు. ఇది రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. సక్సేనా తన పోస్టును ఎడిట్ చేయడంపై ఆప్ సహా పలు విపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. తొక్కిసలాట ప్రమాదాన్ని కేంద్రంలో, ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ తక్కువ చేసి చూపించాలని, మరణాలను దాచిపెట్టాలని భావించిందని ఆరోపించాయి. ఎల్జీ సక్సేనా ఎక్స్లో తన పోస్టును ఎడిట్ చేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాయి.