Rahul Gandhi: మచాడో మాదిరే రాహుల్ పోరాటం
ABN , Publish Date - Oct 12 , 2025 | 05:48 AM
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా మచాడో మాదిరే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగ రక్షణ కోసం..
ఎన్డీఏ నియంతృత్వంపై పోరాడుతున్నారు
ఎక్స్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోస్ట్
99సార్లు ఓడిపోయినందుకు నోబెల్ ఇవ్వాలి: బీజేపీ ఎద్దేవా
న్యూఢిల్లీ, అక్టోబరు 11: నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా మచాడో మాదిరే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగ రక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్ నేత చేసిన పోస్టు వైరల్గా మారింది. రాజ్యాంగ రక్షణ కోసం పోరాటం పేరుతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్పుట్ ఎక్స్లో ఒక పోస్టు చేశారు. ‘‘ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న వెనెజువెలా ప్రతిపక్ష నేత మచాడోకు నోబెల్ శాంతిపురస్కారం దక్కింది. ఆమె మాదిరే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇక్కడి ఎన్డీఏ ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు’’ అని సురేంద్ర పేర్కొన్నారు. దీనిపై బీజేపీ స్పందించింది. 99 ఎన్నికల్లో ఓడిపోయినందుకు రాహుల్ గాంధీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా వ్యాఖ్యానించారు.