Chennai: డ్రైవర్లను హెచ్చరించే పరికరం వచ్చేస్తోంది..
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:16 PM
ప్రయాణికులకు నిజంగా ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే రాత్రిపూట బస్సు డ్రైవర్లు నిద్రలోకి జారుకుంటే వారిని హెచ్చరించే కృత్రిమ మేథో పరికరం బస్సుల్లో ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.
- ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా ఏర్పాటు
చెన్నై: బస్సు డ్రైవర్లు, బస్సులో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ చర్యలు చేపడుతోంది. దూరప్రాంతాల బస్సుల్లో డ్రైవర్లు నిద్రమత్తులో జోగాడితే ఎప్పటికప్పుడు హెచ్చరించేలా కృత్రిమ మేథో పరికరం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల డ్రైవర్లు కొందరు పనిభారం, ఇతర ఒత్తిళ్ల కారణంగా నిద్రమత్తుకు గురవుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
అలాగే, కొందరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సమయంలోనూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టేలా కృత్రిమ మేథో పరికరం ఏర్పాటుచేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. అందుకోసం రూ.2 కోట్లతో కొనుగోలు చేసిన పరికరాలను 500 బస్సుల్లో అమర్చనున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నా, ఆవులించినా, నిర్లక్ష్యంగా బస్సు నడిపినా ఈ పరికరం గుర్తించి హెచ్చరికలు జారీ చేస్తుంది. డ్రైవర్ ముందు కెమెరాతో కూడిన ఈ పరికరం,

డ్రైవర్ ముఖకవళికలను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉంటుంది. అతడు నిద్రపోయినా, ఆవులించినా, అతని కనురెప్పలు మూతపడినా ఈ పరికరంతో అనుసంధానమై వున్న సెన్సార్ పరికరం సైరన్ మోగిస్తుంది. అలాగే, బస్సు నాలుగు వైపులా కెమెరాలు అమర్చనున్నారు. ఒకవేళ బస్సు ప్రమాదానికి గురైతే, ప్రమాదానికి గల కారణాలను పోలీసులు సత్వరం తెలుసుకునేలా ఈ కెమెరాలు పనిచేస్తాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News